CM Chandrababu : ఏపీలో పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

  • 1,650 మంది పోలీసు అధికారులతో సీఎం భారీ సమీక్ష
  • మహిళలు, చిన్నారులపై నేరాల కట్టడికి ఆదేశాలు
  • సైబర్ క్రైమ్, గంజాయి ముఠాలపై ఉక్కుపాదం
  • ఫేక్ ప్రచారాలపై ముందస్తు చర్యలకు సూచన
Cm Chandrababu

Cm Chandrababu

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయం నుంచి అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో హోం మంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా , ఇతర ఉన్నతాధికారులు నేరుగా పాల్గొనగా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేంజ్ ఐజీలు, డీఐజీలు, జిల్లాల ఎస్పీలు, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లు , ఎస్ఐలు వర్చువల్ విధానంలో హాజరయ్యారు. మొత్తం 1,200కు పైగా పోలీస్ స్టేషన్ల నుంచి స్టేషన్ హౌస్ ఆఫీసర్లు (SHOs) సహా దాదాపు 1,650 మంది అధికారులు ఒకేసారి ఈ వర్చువల్ సమావేశంలో పాలుపంచుకోవడం విశేషం. ఈ సందర్భంగా క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు అందరికీ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల పనితీరు, కేసులు నమోదు చేసే తీరు , ప్రజలకు వేగంగా న్యాయం అందించే ప్రక్రియపై సీఎం దిశా నిర్దేశం చేశారు.

నేరాల కట్టడికి కఠిన ఆదేశాలు

రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న నేరాల నియంత్రణతో పాటు సైబర్ క్రైమ్స్, బ్లేడ్ బ్యాచ్‌లు, గంజాయి ముఠాల ఆగడాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేయాలని ముఖ్యమంత్రి పోలీసు యంత్రాంగాన్ని కఠినంగా ఆదేశించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఫేక్ ప్రచారాలను అరికట్టేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదవుతున్న కేసుల పురోగతిని సమీక్షిస్తూ, సమాజంలో భయాందోళనలు సృష్టిస్తూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై ఎలాంటి దాక్షిణ్యం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కొనసాగిస్తూనే నేరస్థుల పట్ల సింహస్వప్నంగా వ్యవహరించాలని, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని సీఎం రేవంత్ తరహాలోనే ఉన్నతాధికారులను హెచ్చరించారు.