Chandra Babu Fires on AP Government: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఫైర్ అయ్యారు. కోవిడ్ నిధులనూ దారి మళ్ళించడం మానవత్వం లేని జగన్ పాలనకు నిదర్శనమని చంద్రబాబు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం రూ.1100 కోట్ల కోవిడ్ విపత్తు నిధులను దారి మళ్లించిందని చంద్రబాబు వివరించారు. దీన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టిందని.. దారి మళ్లించిన నిధులను వెంటనే SDRF ఖాతాలో జమ చెయ్యాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు జగన్ ఇష్టానుసార పాలనకు చెంప పెట్టులాంటిదని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తప్పులు చేస్తున్నదే కాకుండా వాటిని సమర్థించుకోవడం కోసం వైసీపీ కొత్త తప్పులు చేస్తోందని మండిపడ్డారు.
Read Also: Vijaya Sai Reddy: చంద్రబాబు ఒట్టు తీసి కరకట్ట గట్టున పెట్టేశాడు
అటు కోవిడ్ బాధితులకు సాయంగా అందాల్సిన నిధులను కూడా దారి మళ్లించడం మానవత్వం లేని జగన్ వైఖరికి నిదర్శనమని చంద్రబాబు విమర్శలు చేశారు. కోవిడ్ లేదా వరదల వంటి విపత్తులు వచ్చినప్పుడు అదనపు కేటాయింపులతో ప్రజలకు సాయం అందించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇలా నిధులు మళ్లించి పబ్బం గడుపుకోవడం బాధితులకు అన్యాయం చేయడమే అని చంద్రబాబు ఆరోపించారు. కరోనా పరిహారం అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే.. నాలుగు వారాల్లోగా ఫిర్యాదు పరిష్కరించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సాకులు చెప్పకుండా అమలు చేయాలన్నారు. కరోనా వైరస్ కారణంగా చిన్నాభిన్నం అయిన బాధిత కుటుంబాలను ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
