Central Government: ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ.4,721 కోట్ల నిధులు విడుదల

Central Government Funds

Central Government Funds

Central Government: ఆర్ధిక ఇబ్బందులతో సతమతం అవుతున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా పలు రాష్ట్రాలకు పన్నుల వాటా నిధులను విడుదల చేసింది. ఆయా రాష్ట్రాల నుంచి జీఎస్టీ రూపంలో ప‌న్నుల‌ను అందుకుంటున్న కేంద్ర ప్రభుత్వం అందులో రాష్ట్రాల వాటాను ఆయా రాష్ట్రాల‌కు విడుద‌ల చేసింది. ఇందులో భాగంగా బుధ‌వారం కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల‌కు రెండో విడ‌త ప‌న్నుల వాటాను విడుద‌ల చేసింది. తొలి వాటా కింద దేశంలోని 28 రాష్ట్రాల‌కు రూ.58,332 కోట్లను విడుద‌ల చేసిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా రెండో వాటా కింద రూ.1,16,665.75 కోట్లను విడుద‌ల చేసింది. రెండో వాటా కింద విడుదలైన నిధులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.4,721 కోట్లను విడుదల చేయగా, తెలంగాణ‌ రాష్ట్రానికి రూ.2,452 కోట్లు విడుద‌ల‌య్యాయి.

Read Also: Farmer Got Diamond: రైతు పంట పండింది.. రూ.2 కోట్ల వజ్రం దొరికింది

దేశంలోని అన్ని రాష్ట్రాల స‌ర్వతోముఖాభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని చెప్పడానికి ఈ ప‌న్నుల వాటా విడుద‌లే నిద‌ర్శన‌మ‌ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రక‌ట‌న‌లో తెలిపింది. రాష్ట్రాల‌కు బుధ‌వారం విడుద‌లైన రెండో విడ‌త ప‌న్నుల వాటాలో అత్యధికంగా ఉత్తర‌ప్రదేశ్‌కు రూ.20,928 కోట్లు విడుద‌ల కాగా… ఆ త‌ర్వాత స్థానంలో నిలిచిన‌ బీహార్‌కు రూ.11,734 కోట్లు విడుద‌ల‌య్యాయి. గోవాకు అత్యల్పంగా రూ.450.32 కోట్లు విడుద‌లయ్యాయి. కాగా స్థానిక సంస్థలకు గత ఏడాదిగా కేంద్రం నిధులు విడుదల కాలేదని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. స్థానిక సంస్థలకు గత ఏడాది రెండో విడత 15వ ఆర్థిక సంఘం నిధులు ఇంతవరకు విడుదల కాలేద‌ని తెలిపింది. గ్రామ పంచాయ‌తీల‌కు రూ. 678.65 కోట్లు, మండ‌ల జిల్లా ప‌రిష‌త్ ల‌కు రూ. 290.86 కోట్లు, మొత్తం బ‌కాయిలు రూ.969 కోట్లు ఉన్నట్లు ఇటీవల ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని బహిర్గతం చేసింది.