పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చింది. నిర్ణీత గడువులోగా పూర్తి కావడం అసాధ్యమని పార్లమెంటు సాక్షిగా తేల్చిచెప్పింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం గురించి ప్రశ్నించారు. కనకమేడల ప్రశ్నకు కేంద్ర జలశక్తివనరుల సహాయమంత్రి బిశ్వేశ్వర తుడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022 ఏప్రిల్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా, సాంకేతిక కారణాల వల్ల పనుల్లో జాప్యం జరుగుతోందని తెలిపారు. బాధితులకు పునరావాసం, పరిహారంలో జాప్యంతో పాటు కరోనా కారణంగా నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయని వెల్లడించారు. స్పిల్ వే చానల్ పనులు 88 శాతం పూర్తవగా, అప్రోచ్ చానల్ ఎర్త్ వర్క్ పనులు 73 శాతం, పైలెట్ చానల్ పనులు 34 శాతం మాత్రమే పూర్తయ్యాయని కేంద్రం ప్రకటించింది.
మరోవైపు…పోలవరం ప్రాజెక్ట్లో ఇరిగేషన్ విభాగానికి మాత్రమే నిధులు కేటాయించబోతున్నట్లు జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. 2017-18 ధరల ప్రాతిపదికపై పోలవరం ప్రాజెక్ట్ పనులకు సంబంధించి రెండోసారి సవరించిన అంచనా వ్యయం మొత్తం 55వేల 548 కోట్లను 2019 ఫిబ్రవరిలో జరిగిన సలహా సంఘం సమావేశం ఆమోదించినట్లు తెలిపారు. తదుపరి దీనిని పరిశీలించిన “రివైజ్డ్ కాస్ట్ కమిటీ” సవరించిన అంచనా వ్యయంలో కేవలం ఇరిగేషన్ విభాగానికి అయ్యే ఖర్చు మొత్తం 35వేల 950 కోట్లకు ఆమోదం తెలుపుతూ మార్చి 2020న నివేదికను సమర్పించింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ తుది సిఫార్సుల తర్వాత ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ తీసుకోవడం జరుగుతుందని కేంద్రమంత్రి తెలిపారు.
2014 ఏప్రిల్ 1 నుంచి పోలవరం ప్రాజెక్ట్లో ఇరిగేషన్ విభాగం పనులకు అయ్యే వ్యయాన్ని నూరు శాతం భరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తదనుగుణంగా పోలవరం పనుల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసే ఖర్చుకు సంబంధించిన బిల్లులను పీపీఏ, సెంట్రల్ వాటర్ కమిషన్ పరిశీలించి, సిఫార్సు చేసిన మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి రీయంబర్స్ చేస్తున్నట్లు చెప్పారు. 2014 నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ పనులకు సంబంధించి 11వేల 600 కోట్ల రూపాయలను రీయంబర్స్ చేసింది. అదనంగా మరో 711 కోట్ల రూపాయల రీయంబర్స్మెంట్ కోరుతూ ఇటీవలే పీపీఏ, సీడబ్ల్యూసీ సిఫార్సు చేసినట్లు కేంద్రమంత్రి చెప్పారు.