Kapu Reservations: ఏపీలో కాపుల రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాపులకు 5శాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2019లో టీడీపీ ప్రభుత్వం చట్టం చేసింది. ఈ నేపథ్యంలో కాపులకు గత ప్రభుత్వం ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్ చెల్లుతుందని, ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్ల కల్పనకు తమ అనుమతి అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో ఏ కులానికైనా ఓబీసీ రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్రానికి అధికారం ఉందని కేంద్రం వివరించింది. ఓబీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్ర జాబితాకు సంబంధించినది అని.. 2019లో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన చట్టం చట్టబద్ధమైనదే అని తెలిపింది.
Read Also: Andhra Pradesh: కేంద్రం కీలక ప్రకటన.. రూ.106 కోట్లతో విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు
రాష్ట్ర జాబితాలో ఉన్న కాపులకు రిజర్వేషన్ల కల్పనలో తమ పాత్ర లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. టీడీపీ హయాంలో కాపులకు కల్పించిన 5 శాతం రిజర్వేషన్ బిల్లు చెల్లుతుందని కేంద్రం తెలిపింది. 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఓబీసీ వర్గాలకు గరిష్టంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించవచ్చని తెలిపింది. 2021లో చేసిన 105వ రాజ్యాంగ సవరణ ప్రకారం సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సొంత జాబితాను తయారు చేసుకోవచ్చని సూచించింది. కాగా కాపుల రిజర్వేషన్ అంశంపై రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయమంత్రి ప్రతిమా భౌమిక్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.