నేరాలు, ఘోరాలు ఎక్కువ అయిపోతున్నాయి. యువకులు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలీడం లేదు. మళ్ళీ బ్లేడ్ బ్యాచ్ దాడులు ఏపీలో కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఓ యువకుడిపై బ్లేడ్ బ్యాచ్ దాడిచేసి గాయపరిచింది. రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ దాడి చేసినట్లు పవన్ అనే మెడికల్ రిప్రెజెంట్ త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్వారీ ఏరియాకు చెందిన పవన్ తొర్రేడు నుండి విధులు ముగించుకుని కలెక్షన్ బ్యాగ్ తో ఇంటికి వస్తున్నట్లు చెబుతున్నాడు. కంపోస్ట్ యార్డ్ వద్ద నలుగురు యువకులు బ్లేడ్ తో దాడి చేసి, కలెక్షన్ చేసి తీసుకుని వస్తున్న బ్యాగ్ లోని 30 వేల రూపాయలు బ్లేడ్ బ్యాచ్ దాడి అపహరించినట్లు బాధితుడు ఫిర్యాదు చేశాడు.
బ్లేడ్ బ్యాచ్ దాడి వల్ల బాధితుడి మెడ, ఛాతీపై బ్లేడ్ తో గీసిన గాయాలు ఉన్నాయి. రక్త స్రావం కావడంతో బాధితుడిని కుటుంబ సభ్యులు రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. బ్లేడ్ బ్యాచ్ దాడి ఘటనను త్రీ టౌన్ సిఐ మధుబాబు పరిశీలించారు. బాధితుడిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అయితే ఘటనపై మీడియాతో మాట్లాడడానికి పోలీసులు నిరాకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని అంటున్నారు. ప్రశాంతంగా ఉండే రాజమండ్రిలో ఇలాంటి ఘటన కలకలం రేపింది.
Read Also: ISRO: సత్తా చాటిన ఇస్రో.. విజయవంతంగా మేఘా ట్రోపిక్-1 శాటిలైట్ కూల్చివేత