Atchutapuram Accident: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లిలోని అచ్యుతాపురంలో గల ఫార్మా కంపెనీలో బుధవారం జరిగిన రియాక్టర్ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర సర్కార్ ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారికి 2 లక్షల రూపాయలను అలాగే గాయపడిన కుటుంబాలకు 50 వేల రూపాయల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు పీఎంవో ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ఈ ఘటన చాలా దురదృష్టకరం అని.. పేలుడులో గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం చెప్పుకొచ్చింది.
Read Also: Sri Shirdi Sai Chalisa: సాయి చాలీసా వింటే మానసిక రుగ్మతల నుండి బయటపడతారు
అయితే, రియాక్టర్ పేలుడు తర్వాత సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో ఇప్పటి వరకు 17 మంది వరకు మరణించారని సుమారు 35 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తుంది. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ఇవాళ (గురువారం) సీఎం పరామర్శించనున్నారు. అచ్యుతాపురం రియాక్టర్ పేలుడు ఘటనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.