ఏపీలోని నర్సీపట్నంలో హైటెన్షన్ నెలకొంది. మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నాయకులు అయ్యన్నపాత్రుడు ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. అయ్యన్న అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివారాన్ని విధ్వంస దినంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మార్చిందని ఆయన మండిపడ్డారు. అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను కూల్చడాన్ని ఖండిస్తున్నా్న్న అచ్చెన్నాయుడు.. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులు అయ్యన్నపాత్రుడిపై జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. ప్రజా క్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యం లేక విధ్వంసాలు, విద్వేషాలు, కక్ష సాధింపు చర్యలతో రాష్ట్రాన్ని అస్తవ్యస్థంగా చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ గూండారాజుగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఆయన విమర్శలు గుప్పించారు.
అధికారంలో ఉన్న పక్షానికి పోలీసులు మద్దతుగా నిలిస్తే.. ఆ తరువాత టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే పోలీసులు, అధికారులు వడ్డీతో సహా మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఆయన హెచ్చరించారు. జగన్ పాలనలో ఆగడాలు, అకృత్యాలు కోకొల్లలు అని, పోలీసుల అతిప్రవర్తన హద్దు అదుపు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు. నేరస్థుడు రాజ్యం ఏలితే ఎన్ని అనర్ధాలు చోటు చేసుకొంటాయో, అరాచక శక్తులు ఏ విధంగా చెలరేగిపోతాయో, ఆర్ధిక వ్యవస్థ ఏ విధంగా నాశనమవుతుందో మూడేళ్లలో జగన్ రెడ్డి పాలనలో జరిగిన ఉదంతాలే నిదర్శనమని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.