AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!

  • రూ.2,08,406 కోట్ల పెట్టుబడులకు SIPB ఆమోదం
  • 21,627 మందికి ఉద్యోగ అవకాశాలు
  • డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల ద్వారా ప్రోత్సాహకాలు
  • 175 MSME పార్కుల ఏర్పాటుకు ఏపీ సర్కార్ ప్లాన్
Amaravati

Amaravati

AP Investments : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశం అత్యంత కీలక నిర్ణయాలతో నిర్వహించబడింది. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా రూ. 2,08,406 కోట్ల విలువైన భారీ పెట్టుబడుల ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఏకంగా 21,627 ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వచ్చే డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల ద్వారా పారిశ్రామిక ప్రోత్సాహకాలను అందించనున్నట్లు ప్రకటించిన సీఎం, గ్రామీణ ప్రాంతాలు కూడా వేగంగా అభివృద్ధి చెందేలా పరిశ్రమల ఏర్పాటు ఉండాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాబోయే సెప్టెంబరు నాటికి రాష్ట్రంలో 175 ఎంఎస్ఎంఈ (MSME) పార్కులను అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్న డిఫెన్స్ ప్రాజెక్టులు దేశానికే గర్వకారణంగా నిలుస్తాయని పేర్కొన్న సీఎం చంద్రబాబు, రాబోయే రోజుల్లో గ్రీన్ అమ్మోనియా, లిథియం ఐయాన్ బ్యాటరీలు, రోబోటిక్స్ వంటి భవిష్యత్తు సాంకేతిక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. 20వ ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం పొందిన ప్రాజెక్టుల వివరాలను అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. సరికొత్త పారిశ్రామిక విధానాలు , మౌలిక వసతుల కల్పన ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.