ఏపీలో ఐఏఎస్ అధికారులపై రాష్ట్ర హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపులో కోర్టు ధిక్కార కేసులో హైకోర్టు సీరియస్ అయింది. కోర్టుకు హాజరైన ఐఏఎస్ అధికారులు గోపాలకృష్ణ ద్వివేది, రావత్, కొన శశిధర్ పై మండిపడింది. కర్నూలులో ప్రభుత్వం డబ్బు ఇవ్వకపోవడంతో ఆత్మ హత్య చేసుకున్న కాంట్రాక్టర్ వ్యవహారంపై అధికారులను నిలదీసింది హైకోర్టు.
ఆ కుటుంబానికి ఎవరు ఆసరా కల్పిస్తారని ప్రశ్నించారు హైకోర్టు న్యాయమూర్తి బట్టు దేవానంద్. అన్ని ఆర్డర్స్లో కోర్టు ధిక్కార కేసులు నమోదైతే ఎలా అని ప్రశ్నించింది హైకోర్టు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకూ సీఎఫ్ఎంఎస్ ద్వారా జరిగిన చెల్లింపుల స్టేట్మెంట్ ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. ఈ కేసు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు.గతంలోనూ ఉపాధి హామీ పథకం బిల్లులు చెల్లించడం లేదని అందిన ఫిర్యాదులపై హైకోర్టు అధికారులపై ఆగ్రహం చెందింది. తాజా కేసు విషయంలో హైకోర్టు ఎలా స్పందిస్తుందో.. అధికారులు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.