IMD : ఎండల తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ ఊరటనిచ్చే సమాచారం వెల్లడించింది. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, నైరుతి రుతుపవనాలు కూడా క్రమంగా ముందుకు సాగుతున్నాయని తెలిపింది. ప్రస్తుతం ఉత్తర-దక్షిణ ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొంది.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశముందని అంచనా వేసింది.
ఇక నైరుతి రుతుపవనాల పురోగతిపై కూడా వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. మే 27 నాటికి అవి అరేబియా సముద్రం, లక్షద్వీప్ ప్రాంతాలు, బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని తెలిపింది. రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో వర్షాలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
