Site icon NTV Telugu

AP Govt: ఏపీలో ధరల స్థిరీకరణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం..

Commetees

Commetees

AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోధరల స్ధిరీకరణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్ర స్థాయిలో ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ చైర్మన్ గానూ, జిల్లా స్ధాయిలో కలెక్టర్ చైర్మన్ గానూ కమిటీలను ఏర్పాటు చేసినట్లు సర్కార్ వెల్లడించింది. రాష్ట్ర స్ధాయి కమిటీలో 21 మంది సభ్యులు, జిల్లా స్థాయిలో 17 మంది సభ్యులు ఉండనున్నారు. ఈ కమిటీలు ధరల స్ధిరీకరణకు కావాల్సిన అంశాలను ప్రభుత్వానికి సూచించనున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయం అంశంలో ఈ కమిటీలు కీలక సూచనలిస్తాయి. కాగా, సమస్యలపై స్పందించడానికి కావాల్సిన విధి విధానాలను సైతం ప్రభుత్వానికి ఈ కమిటీలు సూచనలు చేయనున్నాయి. రాష్ట్ర స్ధాయి కమిటీ పాలసీ సంబంధిత అంశాలను సూచిస్తుంది. రాష్ట్ర స్ధాయి కమిటీలో సంబంధిత శాఖల సెక్రటరీలు, తూనికలు కొలతల అధికారులు సైతం ఉంటారు.

Read Also: Piles home remedies: ఇంటి పక్కనే దొరికే ఈ ఆకులను నమిలితే చాలా.. పైల్స్ సమస్యకు చెక్‌!

మరోవైపు రాష్ట్రంలో ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పథకంపై కీలక ప్రకటన చేసింది. ఈ నెల 29 నుంచి గ్యాస్‌ బుకింగ్స్‌ చేస్తున్నారు. ఈ దీపం పథకానికి సంబంధించి ఎల్‌పీజీ కనెక్షన్‌, తెల్ల రేషన్‌ కార్డు, ఆధార్‌కార్డు అర్హులుగా చెప్పుకొచ్చింది సర్కార్. రేపు (అక్టోబర్ 31)వ తేదీన ఉచిత గ్యాస్‌ సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వెంటనే‌ ఒక మెసేజ్ కస్టమర్ ఫోన్‌ నంబర్‌కు వెళుతుంది.. అలాగే, బుక్‌ చేసుకున్న 24 గంటల్లో పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లో గ్యాస్‌ సిలిండర్లను డెలివరీ చేయనున్నారు. బుక్ చేసిన సిలిండర్‌ డెలివరీ చేసిన 48 గంటల్లోనే డీబీటీ విధానం ద్వారా లబ్ధిదారుల అకౌంట్‌లో నేరుగా రాయితీ సొమ్ము జమ చేస్తామని ఏపీ సర్కార్ వెల్లడించింది.

Exit mobile version