NTV Telugu Site icon

AP Governor: ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ గవర్నర్ విజ్ఞప్తి..

Governor

Governor

AP Governor: భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని.. ప్రభుత్వ అధికారుల సహాయంతో అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటికి వెళ్లవద్దని గవర్నర్ హెచ్చరించారు. ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారు ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని.. తద్వారా వారిని రక్షించి పునరావాస ప్రాంతాలకు తరలించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ఏర్పాటు చేయవచ్చని ఆయన అన్నారు. రెడ్‌క్రాస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇతర ఎన్‌జీవోలు ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలి.. బాధితులకు ఆహారం, మందులు, ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీలో రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్‌లలో చురుకుగా పాల్గొనాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ అభ్యర్థించారు.

Read Also: Happy Birthday Pawan Kalyan: నీలాంటి నాయకుడే కావాలి.. అద్భుతాలు నువ్వు మాత్రమే చేయగలవు: చిరు

ఇక, విజయవాడతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వర్షాల కారణంగా సంభవించిన ప్రాణనష్టంపై గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మరోవైపు, రైలు సర్వీసులపై భారీ వర్షాల ఎఫెక్ట్ పడింది. ఇవాళ ఉదయం 96 రైళ్లు రద్దు చేయగా.. నిన్న రాత్రి వరకు 177 రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. 142 రైళ్లను దారి మళ్లించిన రైల్వే అధికారులు.. వరద ఉధృతికి మహబూబాబాద్ దగ్గర దెబ్బతిన్న రైల్వే ట్రాక్.. ట్రాక్ ను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నారు.. ట్రాక్ పునరుద్ధరణకు మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్, విజయవాడ, వరంగల్ లో హెల్ప్ డెస్కులను రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు.