గుడ్ న్యూస్… ఏపీలో కరోనా టెస్ట్ ధరలు తగ్గింపు

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీపీసీఆర్ కరోనా టెస్ట్ ధరను తాజాగా ప్రభుత్వం సవరించింది. ఐసీఎంఆర్‌ గుర్తింపు కలిగిన ఎన్‌ఏబీఎల్‌ ప్రైవేటు ల్యాబ్‌లలో ఆర్టీపీసీఆర్‌ ధరను రూ.350గా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం పంపే ఆర్టీపీసీఆర్ శాంపిళ్లను పరీక్షించేందుకు ఒక్కో టెస్టుకు రూ.475, అలాగే ఎన్‌ఏబీఎల్‌ ల్యాబ్‌లలో అయితే రూ.499 వసూలుచేస్తున్నారు. ఇప్పుడు దానిని రూ.350గా నిర్ణయించారు. ఈ మేరకు ఆస్పత్రులు, ల్యాబ్‌లలో తప్పనిసరిగా సవరించిన రేట్లను ప్రదర్శించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Read Also: సినిమా హాళ్ళలో కోవిడ్ ఆంక్షలు

సవరించిన రేట్లకే పరీక్షలు జరిగేలా జిల్లా వైద్యాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ప్రభుత్వం సూచించింది. ఎవరైనా ఎక్కువ ధర వసూలు చేస్తే ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చంది. మరోవైపు ఏపీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ అమలు చేస్తోంది. ఈ నెల 31 వరకు రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూను అధికారులు కఠినంగా అమలు చేయనున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించని వారికి రూ.100 జరిమానా.. మాస్క్ లేనివారిని దుకాణాలకు రానిస్తే యజమానులకు భారీ జరిమానా విధిస్తామని ఇప్పటికే పోలీసులు హెచ్చరించారు.