ఆంధ్రప్రదేశ్లో భానుడి భగభగలు కేవలం ప్రజల జీవనశైలినే కాదు, ప్రాణరక్షణ వ్యవస్థలను కూడా అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు ప్రస్తుతం వేగంగా తగ్గిపోతున్నాయి. సాధారణంగా మే, జూన్ నెలల్లో తలెత్తే ఈ రక్త కొరత సమస్య, ఈ ఏడాది మార్చి నెల నుంచే ప్రారంభం కావడం వైద్య వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఎండల తీవ్రత పెరగడంతో రక్తదాతలు బయటకు వచ్చి రక్తం ఇచ్చేందుకు వెనకడుగు వేయడం ఈ పరిస్థితికి ప్రధాన కారణమవుతోంది.
వేసవి సెలవుల కారణంగా ముందుగా నిర్ణయించిన శస్త్రచికిత్సలు (Planned Surgeries) ఈ సమయంలో ఎక్కువగా జరుగుతుంటాయి. దీనివల్ల సాధారణం కంటే అదనంగా సుమారు 100 యూనిట్ల రక్తం అవసరమవుతోంది. ఒకప్పుడు రోజుకు 400 యూనిట్లకు పైగా రక్తాన్ని సరఫరా చేసిన బ్లడ్ బ్యాంకులు, ప్రస్తుతం కేవలం 30 నుంచి 40 యూనిట్లు మాత్రమే అందించగలిగే స్థితికి చేరుకున్నాయి. గతంలో రోజుకు 15 యూనిట్ల వరకు రక్తాన్ని సరఫరా చేసే చిన్న బ్లడ్ బ్యాంకులు కూడా, గత వారం రోజులుగా కేవలం 5 నుంచి 6 యూనిట్లకు మించి ఇవ్వలేకపోతున్నాయి.
రక్త నిల్వల క్షీణతలో ముఖ్యంగా నెగిటివ్ బ్లడ్ గ్రూపుల కొరత అత్యంత క్లిష్టంగా మారింది. అందుబాటులో ఉన్న ప్రతి 100 బ్లడ్ ప్యాకెట్లలో కేవలం 10 మాత్రమే నెగిటివ్ గ్రూపులు ఉంటున్నాయి, ఇది తలసీమియా , హృద్రోగులకు పెద్ద సమస్యగా పరిణమించింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి నెలకు సుమారు 500 యూనిట్ల రక్తం అవసరమని వైద్యులు వెల్లడిస్తున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులను కాపాడేందుకు రక్తదాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు.
