Ganesh Immersion Without Water: పసిఫిక్ మహాసముద్రంలో సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరిగిపోయాయి.. వర్షాల జాడ లేదు.. వర్షా కాలంలో ఏ నెల తీసుకున్నా.. తెలుగు రాష్ట్రాల్లో లోటు వర్షపాతమే.. వర్షాలు పడింది లేదు.. వాగులు సాగింది లేదు.. కుంటలు, చెరువులు, నదులు, ప్రాజెక్టుల్లోకి నీళ్లు వచ్చింది లేదు.. కాలువలకు నీరు వదిలింది లేదు.. అన్నట్టుగా పరిస్థితి తయారైంది.. వర్షాలు కాస్త లేట్గా పడినా.. కనీసం వినాయక చవితి వరకు.. లేదా నిమజ్జనం వరకైనా వర్షాలు పడతాయి.. వినాయకుడి విగ్రహాల నిమజ్జనానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని అంతా ఎదురుచూశారు.. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ ప్రజలకే కాదు.. దేవుళ్లకూ నీటి కష్టాలు తప్పడం లేదు.
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం మండలం మీదుగా వెళ్తున్న హెచ్ఎల్సీలో ఈ సారి నీటి జాడ కరువైంది. దీంతో రైతులు, ప్రజలు సాగు, తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వినాయక చవితి రావడం, లంబోదరుడి విగ్రహాల నిమజ్జనానికి కూడా నీరు కరువవడంతో చేసేదిలేక వెంకటాపురం, దయ్యాల కుంటపల్లికి చెందిన ప్రజలు ఒట్టి కాలువలోనే వినాయకులను వదిలేసి వచ్చారు. మరోవైపు ఎల్లనూరు మండలం చిత్రావతి లోను నీళ్లు లేకపోవడంతో.. ఎండిపోయిన చెరువులోనే వినాయక ప్రతిమలను వదిలివేసి వెళ్లారు. పండుగ వేళ వినాయక విగ్రహాల నిమజ్జనానికి సైతం నీరు అందుబాటులో లేకపోవడం అనంతపురం జిల్లాలో నెలకొన్న నీటి కష్టాలకు అద్దం పడుతోంది. ఒకవైపు సాగు, తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతుండగా.. మరోవైపు పండుగ నిమజ్జనానికి కూడా నీరు లేకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది… నీరు లేని కాలువలు.. ఎండిన చెరువుల్లోనే గణపయ్య విగ్రహాలు నిమజ్జనం చేయాల్సిన దుస్థితి వచ్చింది.. ఘనంగా గణపయ్యను గంగమ్మ ఒడికి చేర్చే అవకాశమే లేకుండా పోవడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..

