Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన

Payyavula Keshav

Payyavula Keshav

Minister Payyavula Keshav: అనంతపురం జిల్లాలో నెలకొన్న నీటి పరిస్థితులపై రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితంలో ఇంతటి నీటి కష్టాలను ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు. 1994లో ఇలాంటి నీటి కష్టాలను చూశానని, ప్రస్తుతం రైతులు ప్రకృతితో యుద్ధం చేస్తున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాలను తాను కళ్లారా చూస్తున్నానని తెలిపారు. నీటి లభ్యతపై ప్రజలు, రైతులను అప్రమత్తం చేసేందుకు ప్రతి గ్రామంలో చాటింపు వేయించామని మంత్రి తెలిపారు. ముఖ్యంగా రైతులు పెట్టుబడులు పెట్టి నష్టపోకూడదనే ఉద్దేశంతో నీటి పరిస్థితిని ముందుగానే తెలియజేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం తాగునీటికే అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వచ్చే ఏడాది జూలై వరకు అవసరమైన తాగునీటిని నిల్వ చేసుకునేలా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.

సాగునీటి పరిస్థితి తీవ్రంగా ఉందని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు. ఈ ఏడాది వరి, మిర్చి వంటి పంటలకు నీరు అందించే పరిస్థితి లేదని తెలిపారు. హెచ్‌ఎల్‌సీ, హంద్రీ-నీవా కాలువలపై ఆధారపడే రైతులు పంటలు వేయవద్దని ఆయన స్పష్టంగా సూచించారు. నీటి లభ్యతపై స్పష్టత లేకుండా రైతులు సాగు ప్రారంభిస్తే పెట్టుబడులు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తుంగభద్ర డ్యాం నుంచి హెచ్‌ఎల్‌సీకి నవంబర్ 10వ తేదీ వరకు నీరు వచ్చే అవకాశం ఉందని పయ్యావుల కేశవ్ తెలిపారు. మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు చెప్పారు. అందుబాటులో ఉన్న నీటిని ముందుగా తాగునీటి అవసరాలకు వినియోగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

తాగునీటి అవసరాలను ముందుగా తీర్చిన అనంతరం హంద్రీ-నీవా ద్వారా సాగునీటి కేటాయింపులపై మరోసారి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు అత్యంత క్లిష్టంగా ఉన్నాయని, ఈ సంవత్సరం చాలా కష్టకాలమని ఆయన పేర్కొన్నారు. రైతులు పరిస్థితిని అర్థం చేసుకుని సాగు విషయంలో జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు మంత్రి పయ్యావుల కేశవ్‌…