YS Jagan: జూనియర్ డాక్టర్ల సమ్మెపై వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

Ys Jagan

Ys Jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్‌ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది.. జూడాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం కావడంతో.. వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగిస్తున్నారు.. అయితే, జూనియర్ డాక్టర్ల ఆందోళనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ప్రాణాలు కాపాడే జూనియర్ డాక్టర్లను రోడ్డెక్కించి పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడతారా అంటూ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులను వెంటనే చర్చలకు పిలిచి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయన ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని 19 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన దాదాపు 9 వేల మంది జూనియర్ డాక్టర్లు రెండు వారాలుగా ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని జగన్ ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం జనవరి 1 నుంచి అమలు కావాల్సిన స్టైపెండ్ సవరణను ఎందుకు నిలిపివేశారని నిలదీశారు.

స్టైపెండ్ పెంపుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జగన్

జీవో నంబర్ 287 ప్రకారం జూనియర్ డాక్టర్ల స్టైపెండ్‌ను 15 శాతం పెంచాల్సి ఉండగా, తమ ప్రభుత్వ హయాంలో అంతకంటే ఎక్కువగా 42.4 శాతం పెంచామని జగన్ పేర్కొన్నారు. సూపర్ స్పెషాలిటీ కోర్సులు అభ్యసిస్తున్న వారిని సీనియర్ రెసిడెంట్లుగా గుర్తించి వారి విజ్ఞప్తులను కూడా పరిగణనలోకి తీసుకున్నామని తెలిపారు. అదేవిధంగా మొత్తంగా 77 శాతం మందికి నిర్దేశించిన దానికంటే ఎక్కువగా స్టైపెండ్ పెంచినట్లు జగన్ చెప్పారు. ఆయుష్ విభాగానికి చెందిన జూనియర్ డాక్టర్లకు కూడా అల్లోపతి జూనియర్ డాక్టర్ల తరహాలోనే స్టైపెండ్ పెంచామని పేర్కొన్నారు. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని 15 శాతం కంటే మెరుగైన పెంపు ఇవ్వాలని జూనియర్ డాక్టర్లు కోరుతున్నారని జగన్ అన్నారు. అయితే ప్రభుత్వం కేవలం 3 నుంచి 5 శాతం మాత్రమే పెంచుతామని చెప్పడం అన్యాయమని విమర్శించారు.

అత్యవసర వైద్య సేవలకు అంతరాయం

ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్య సేవలు ప్రధానంగా జూనియర్ డాక్టర్ల సేవలపైనే ఆధారపడి ఉన్నాయని జగన్ అన్నారు. వారి సమ్మె కారణంగా క్యాజువాలిటీ, ఐసీయూ, లేబర్ రూమ్ వంటి అత్యవసర విభాగాల్లో సేవలకు అంతరాయం ఏర్పడి పేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ పరిస్థితికి ప్రభుత్వ మొండివైఖరే కారణమని ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి జగన్ విమర్శించారు. జూనియర్ డాక్టర్ల సమస్యలను వెంటనే పరిష్కరించి వైద్య సేవలకు అంతరాయం లేకుండా చూడాలని కోరారు.

ఆరోగ్య రంగంపై ప్రభుత్వంపై విమర్శలు
రాష్ట్రంలోని ప్రజారోగ్య వ్యవస్థను ప్రభుత్వం దెబ్బతీస్తోందని జగన్ ఆరోపించారు. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఇప్పటికే సేవలపై ప్రభావం పడుతోందని అన్నారు. తమ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చామని ఆయన పేర్కొన్నారు. వాటిలో ఐదు కాలేజీలను పూర్తి చేసి తరగతులు ప్రారంభించామని, మరో కాలేజీని తరగతులకు సిద్ధం చేశామని, మొత్తంగా ఆరు కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. మిగిలిన మెడికల్ కాలేజీలను పూర్తి చేయాల్సింది పోయి వాటిని విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

వైద్య సిబ్బంది, ఆస్పత్రులపై ఆరోపణలు
ప్రభుత్వ బోధనాసుపత్రులు, ఇతర ఆస్పత్రుల్లో మిగిలిన నాడు-నేడు పనులను నిలిపివేశారని జగన్ విమర్శించారు. WHO, GMP ప్రమాణాలకు అనుగుణంగా మందులు అందుబాటులో లేక ప్రభుత్వ ఆస్పత్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు. అలాగే జీరో వేకెన్సీ పాలసీని పక్కన పెట్టారని, తమ ప్రభుత్వ హయాంలో వైద్య రంగంలో నియమించిన 50 వేల మంది సిబ్బందిని క్రమంగా తగ్గిస్తున్నారని జగన్ అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని దెబ్బతీశారని, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో స్పెషలిస్ట్ డాక్టర్లను తొలగించారని ఆరోపించారు.

విలేజ్, అర్బన్ క్లినిక్‌లను నిర్వీర్యం చేశారని, ఆరోగ్యశ్రీ వ్యవస్థను దెబ్బతీసి రూ.3 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టారని జగన్ విమర్శించారు. ప్రజారోగ్య వ్యవస్థలో ప్రభుత్వం సృష్టించిన సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయని అన్నారు.

జూనియర్ డాక్టర్లతో వెంటనే చర్చలు జరపాలి
జూనియర్ డాక్టర్ల విషయంలో ప్రభుత్వం అహంకార ధోరణిని వీడాలని జగన్ సూచించారు. వారి ప్రతినిధులను వెంటనే చర్చలకు పిలిచి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. స్టైపెండ్‌ను తగిన స్థాయిలో పెంచి, జూనియర్ డాక్టర్ల సమ్మెను విరమింపజేయాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌..