YS Jagan: కూటమి సర్కార్‌పై జగన్‌ ఫైర్.. 3 హత్యలు, 6 హత్యాయత్నాలు, 12 దాడులుగా..!

  • ఎక్స్ వేదికగా చంద్రబాబు సర్కార్ పై వైఎస్ జగన్ ఫైర్..
  • 3 హత్యలు, 6 హత్యాయత్నాలు, 12 దాడులగా చంద్రబాబు పాలన..
  • ప్రసన్నకుమార్‌రెడ్డిపై హత్యాప్రయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపై దాడి..
Ys Jagan

Ys Jagan

YS Jagan: మరోసారి కూటమి ప్రభుత్వంపై సోషల్‌మీడియా వేదికగా ఫైర్‌ అయ్యారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్.. చంద్రబాబు దుర్మార్గపాలన మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, పన్నెండు దాడుల రూపంలో సాగుతోందని దుయ్యబట్టారు.. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై హత్యాప్రయత్నమే లక్ష్యంగా ఆయన ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన జగన్‌.. వయోవృద్ధురాలైన ఆయన తల్లిని భయభ్రాంతులకు గురిచేస్తూ టీడీపీకి చెందిన రౌడీలు చేసిన బీభత్సం, విధ్వంసం, ప్రజాస్వామ్యంపై చేసిన ఒక భయంకరమైన దాడిగా పేర్కొన్నారు.. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్నకుమార్‌రెడ్డిని అంతం చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీ మూకలు, పోలీసుల సమక్షంలో ఈ దాడికి పాల్పడ్డారని స్పష్టంగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ నాయకుడు లక్ష్యంగా ఇలాంటి దాడి చేయడాన్ని గతంలో ఎప్పుడూ ఎక్కడా చూసి ఉండం అన్నారు..

Read Also: Story board: అంతా రైతు సంక్షేమం గురించి మాట్లాడేవారే.. ఆదుకునే వారు మాత్రం లేరు..!

రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో మునిగి తేలుతున్న చంద్రబాబు నాయుడు.. ప్రతిచోటా తన పార్టీకి చెందిన రౌడీలతో ఇలాంటి దాడులు చేయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు జగన్.. చిత్తూరు జిల్లాలో తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులను పరామర్శిస్తూ ప్రతిపక్షనేతగా ఇవాళ నా పర్యటన కార్యక్రమం ప్రజల దృష్టిలో పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక పథకం ప్రకారం వివాదాన్ని సృష్టించారు.. దాన్ని అడ్డం పెట్టుకుని ఈ భయంకరమైన దాడికి పాల్పడి.. దాని మీదే రాష్ట్రం అంతా మాట్లాడుకునేలా చేయాలని, ప్రజా సమస్యలేవీ బయటకు రాకూడదంటూ చేసిన కుట్ర ఇదని పేర్కొన్నారు.. చంద్రబాబు హింసాత్మక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ దాడుల ద్వారా, కక్ష రాజకీయాల ద్వారా ప్రతిపక్షం గొంతు నొక్కలేరనే విషయాన్ని గుర్తించాలని హెచ్చరించారు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి..