డీఎస్సీపై చంద్రబాబు ప్రభుత్వాన్ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్.జగన్ ప్రశ్నించారు. ‘‘మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది?’’ అని నిలదీశారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు.
పేపర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి?
2. మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దు చేసి.. ఉద్దేశ పూర్వకంగా ఆలస్యం చేసి.. కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి, దాన్ని పబ్లిసిటీకి వాడుకుని, తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కామ్లతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా?
3. మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘‘డార్క్ ఆపరేషన్’’ను ఎందుకు దాచిపెడుతున్నారు?
4. పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న SCERT అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది?
5. ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు?
6. సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్లు ఎందుకు పంపారు? కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు?
7. రూ.15 లక్షలకు “స్పోర్ట్స్ కోటా’’ పోస్టుల బేరసారాలా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చిన మాట వాస్తవం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి.
8. టెట్ కన్వీనర్గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీర్ను తొలగించి విద్యా శాఖలోని జాయింట్ డైరెక్టర్ను డీఎస్సీ కన్వీనర్గా ఎందుకు పెట్టారు? దీనివెనుక మతలబు ఏంటి?
9. మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి… దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్ను పదవినుంచి తప్పించి, వెంటనే సీబీఐ దర్యాప్తును కోరండి. ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయండి. మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా..!’’ అని జగన్ ప్రశ్నించారు.
