Jagan 2.0 Super App: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘జగన్ 2.0’ మొబైల్ సూపర్ యాప్ను ఆవిష్కరించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఈ యాప్ను విడుదల చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకుల మధ్య మరింత సమన్వయం పెంపొందించడంతో పాటు క్షేత్రస్థాయిలో సమాచార మార్పిడిని వేగవంతం చేయాలనే ఉద్దేశంతో ఈ యాప్ను రూపొందించినట్లు తెలిపారు.
ఇక, ‘జగన్ 2.0’ యాప్ ద్వారా ప్రతి కార్యకర్త పార్టీతో నేరుగా అనుసంధానమయ్యే అవకాశం ఉంటుందని జగన్ పేర్కొన్నారు. కార్యకర్తలు తమ అభిప్రాయాలను ఎలాంటి భయం లేకుండా యాప్ ద్వారా తెలియజేయవచ్చని చెప్పారు. అలాగే రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పోలీసుల ద్వారా నమోదవుతున్న కేసుల వివరాలను కూడా ఈ యాప్ ద్వారా పార్టీ దృష్టికి తీసుకురావచ్చని వివరించారు. పార్టీ నాయకుల వివరాలు కూడా యాప్లో అందుబాటులో ఉండేలా ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు ఎప్పటికప్పుడు పరస్పరం టచ్లో ఉండేందుకు ఈ డిజిటల్ వేదిక ఉపయోగపడుతుందని చెప్పారు. పార్టీ సమావేశాలకు సంబంధించిన సమాచారం, కార్యక్రమాల లైవ్ ఫీడ్ కూడా యాప్లో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు.
భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొనే కార్యకర్తలకు అండగా నిలిచేలా ప్రత్యేక వ్యవస్థను ఈ యాప్లో ఏర్పాటు చేస్తున్నామని జగన్ తెలిపారు. అలాగే కార్యకర్తల వివరాలు, సమస్యలు, కార్యకలాపాలను నమోదు చేసుకునే విధంగా డిజిటల్ డైరీ ఫీచర్ను కూడా యాప్తో అనుసంధానం చేయనున్నట్లు చెప్పారు. సోషల్ మీడియాలో పార్టీ కార్యకర్తలు చేసే పోస్టులు తొలగించడం, వాటిపై కేసులు నమోదు చేయడం వంటి అంశాలను ప్రస్తావించిన జగన్.. అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు, కార్యకర్తలకు ఒక సమగ్ర డిజిటల్ వేదిక అవసరమని భావించి ‘జగన్ 2.0’ సూపర్ యాప్ను తీసుకొచ్చామని పేర్కొన్నారు. పార్టీతో ప్రతి కార్యకర్తకు నిరంతర అనుసంధానం కల్పించడం, వారి సమస్యలను వెంటనే గుర్తించి స్పందించడం ఈ యాప్ ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు.

