YS Jagan: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిన విషయం విదితమే.. అయితే, వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని మరోసారి స్పష్టం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో ముస్లిం మైనారిటీలతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ముస్లిం మైనారిటీల సమస్యలపై వైసీపీ ఎల్లవేళలా ప్రత్యేక దృష్టి పెట్టింది. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశాం. ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ప్రతి అంశంపై మా పార్టీ తొలి నుంచి అండగా నిలిచిందన్నారు.. వైసీపీ తప్పకుండా మీ వెంట నడుస్తుంది.. వక్ఫ్ బిల్లుపై మీరు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలను మా పార్టీ ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తుతారని తెలిపారు.. ఇక, పార్లమెంటు సంయుక్త కమిటీ (జేపీసీ)లో సభ్యుడిగా ఉన్న మా ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఈ విషయంలో చొరవ తీసుకుని, మీ అన్ని అభ్యంతరాలను పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తారు అని స్పష్టం చేశారు వైఎస్ జగన్..
Read Also: PM Modi: పోలాండ్ నుంచి ఇజ్రాయెల్, రష్యాకు ప్రధాని కీలక సలహా..
ఇక, ఈ సమావేశంలో ముస్లిం సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ.. వక్ఫ్ భూముల్లో దాదాపు 70 శాతానికి పైగా కబ్జాలో ఉన్నాయని, కొత్తగా ప్రతిపాదించిన వక్ఫ్ చట్టంలో రూపొందించిన నిబంధనల ద్వారా తమ (వక్ఫ్) భూములు తమకు దక్కకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. కొత్త వక్ఫ్ బిల్లును మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉందని.. ఆ బిల్లును వైసీపీ వ్యతిరేకించడంపై హర్ష్యం వ్యక్తం చేశారు. బిల్లును వైసీపీ వ్యతిరేకించడం వల్లనే, కేంద్రం దాన్ని జేపీసీకి పంపిందని వారు గుర్తు చేశారు. మరోవైపు.. వక్ఫ్ భూముల పరిరక్షణకు జగన్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ వెల్లడించారు. వక్ఫ్ బోర్డును బలోపేతం చేయడంతో పాటు, ఆ భూముల వివరాలన్నీ ఆన్లైన్ ఒక గొప్ప పరిణామం అన్నారు.. ముస్లింలకు జగన్ చేసిన మేలు, దేశ చరిత్రలో ఏ ఒక్కరూ ఇప్పటి వరకు చేయలేదని స్పష్టం చేశారు. వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కాకుండా దేశంలోనే తొలిసారిగా జీవో నంబర్ 60 జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు హఫీజ్ఖాన్.