YS Jagan: రాష్ట్రంలో ప్రజల తరఫున తమ గొంతు వినిపించకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. శాసనసభలో ఏకైక ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం దానికి నిదర్శనమని పేర్కొన్నారు. అసెంబ్లీలో తమకు బలం తక్కువగా ఉన్నప్పటికీ, మండలిలో మంచి సంఖ్యాబలం ఉందని, అక్కడ ప్రజా సమస్యలపై గట్టిగా గొంతెత్తాలని పార్టీ నేతలకు సూచించారు. ప్రభుత్వాన్ని ఆధారాలతో ప్రశ్నించాలని, ప్రతి అంశంపై పూర్తి అవగాహనతో మాట్లాడాలని సూచించారు. సరైన ప్రిపరేషన్ ఉంటేనే మన గొంతు బలంగా వినిపిస్తుందని అన్నారు.
లడ్డూ వ్యవహారంపై ఆరోపణలు
తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో సీఎం చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టించి దానికి రెక్కలు కట్టారని జగన్ విమర్శించారు. వైసీపీపై నిరంతరం బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. కల్తీ నెయ్యి సరఫరాకు వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇక, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత, మే 15న టీటీడీలో నెయ్యి సరఫరా టెండర్లు ఖరారు అయ్యాయని, ప్రభుత్వం మారిన తర్వాతే సరఫరా ప్రారంభమైందని వివరించారు. జూన్, జూలై నెలల్లో వచ్చిన కొన్ని ట్యాంకర్లు ల్యాబ్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో వెనక్కి పంపించారని తెలిపారు. అయితే అవే ట్యాంకర్లు మరో డెయిరీ పేరుతో తిరిగి టీటీడీకి వచ్చాయని, ఈ అంశం సీబీఐ ఛార్జిషీట్లో కూడా ఉందని పేర్కొన్నారు. ఇవన్నీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినవేనని ఆరోపించారు. టీటీడీలో నెయ్యి నాణ్యత తనిఖీకి పటిష్ట విధానం ఉందని, తమ హయాంలో నాణ్యత లేని 18 ట్యాంకర్లను వెనక్కి పంపించామని చెప్పారు. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో కూడా 15 ట్యాంకర్లు వెనక్కి వెళ్లాయని గుర్తుచేశారు.
దాడులు, అక్రమ కేసులపై విమర్శలు
లడ్డూ వ్యవహారంపై ప్రశ్నించడాన్ని తట్టుకోలేక అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు జరిగాయని, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు, భూమన కరుణాకర్ రెడ్డి పై దాడులు చేశారని, కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు.
ప్రభుత్వంపై ఇతర ఆరోపణలు
కూటమి ప్రభుత్వం స్కామ్ల మయంగా మారిందని జగన్ విమర్శించారు. విశాఖలో రూ.5 వేల కోట్ల విలువైన 54 ఎకరాల భూమిని గీతం యూనివర్సిటీకి కేటాయించారని, ఇలాంటి నిర్ణయం గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోలేదని అన్నారు. ఇక, ప్రజా సమస్యలపై మండలిలో గట్టిగా నిలదీయాలని, ఆధారాలతో మాట్లాడాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. చిత్తశుద్ధితో కష్టపడి పని చేసే వారికి తగిన గుర్తింపు ఉంటుందని చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేకపోవడంతో మీడియా వేదికగా తమ వాదనలు వినిపిస్తున్నామని తెలిపారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్..
