Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. పోలవరం కుడి కాల్వ ద్వారా గన్నవరం నియోజకవర్గంలోని డెల్టా ఆయకట్టు రైతులతో పాటు మెట్ట ప్రాంత రైతులకు కూడా సాగునీరు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గత 11 ఏళ్లుగా పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కృష్ణా నదికి మళ్లించడం వల్ల కృష్ణా డెల్టా రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. 2015లో తాను గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పోలవరం కుడి కాల్వ సమీపంలోని మెట్ట ప్రాంత గ్రామాలకు కూడా నీటిని వినియోగించుకునే అవకాశం కల్పించాలని చంద్రబాబును కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారని లేఖ ద్వారా గుర్తు చేశారు వంశీ..
దీంతో తన సొంత ఖర్చులతో బాపులపాడు, గన్నవరం, ఉంగుటూరు, విజయవాడ గ్రామీణ మండలాల్లో మొత్తం 36 ప్రాంతాల్లో 500కుపైగా విద్యుత్ మోటార్లు ఏర్పాటు చేసి రైతులకు సాగునీరు, చెరువులకు తాగునీటి సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న పదేళ్లలో తొమ్మిది సంవత్సరాలు నిరంతరంగా మెట్ట ప్రాంతాలకు పట్టిసీమ నీరు అందించగలిగామని పేర్కొన్నారు వల్లభనేని.. అయితే ఈ ఏడాది నీటిపారుదల అధికారులు, పోలీసులు బందోబస్తుతో మోటార్లను నిలిపివేస్తున్నారని వంశీ ఆరోపించారు. ఎల్నినో ప్రభావంతో ఇప్పటికే తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో మెట్ట ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు, అనంతరం జగన్ ప్రభుత్వం కూడా ఈ విధానాన్ని కొనసాగించాయని గుర్తుచేస్తూ, ప్రస్తుతం కూడా రైతుల ప్రయోజనాల దృష్ట్యా పట్టిసీమ నీటిని మెట్ట ప్రాంతాలకు అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్..

