Unseasonal Rains Damage: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానలతో వ్యవసాయ పంటలకు జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు గాలివానలు, వర్షాలు, వడగళ్ల కారణంగా దెబ్బతిన్న పంట నష్టం వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కృష్ణా, నెల్లూరు, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాలకు సంబంధించి 16 మండలాల్లోని 89 గ్రామాల్లో పంటలు వర్షాలతో దెబ్బతిన్నట్టు అధికారులు ప్రాథమిక అంచనాలను ముఖ్యమంత్రికి వివరించారు. 384 హెక్టార్లలో వరి, 630 హెక్టార్లలో మొక్కజొన్న, 200 హెక్టార్లలో మినుము వంటి పంటలకు నష్టం వాటిల్లినట్టు తెలిపారు.
Read Also: HDFC Bank: 9% పతనం.. HDFC బ్యాంక్ మార్కెట్ క్యాప్ ఒక్కసారిగా రూ.1 లక్ష కోట్లు డ్రాప్
మొత్తం 1,215 హెక్టార్లలో సాధారణ పంటలు దెబ్బతినగా, 2,043 మంది రైతులు నష్టపోయినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు అధికారులు… అలాగే అనంతపురం, శ్రీసత్యసాయి, ఎన్టీఆర్ జిల్లాల్లోని ఉద్యాన పంటలపైనా అకాల వర్షాలు తీవ్ర ప్రభావం చూపాయని… మొత్తం 307 మంది రైతులకు చెందిన 267 హెక్టార్లలోని అరటి, బొప్పాయి, మామిడి, ఆరెంజ్ తదితర పంటలకు నష్టం వాటిల్లినట్టు ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. అయితే పూర్తిస్థాయిలో పంట నష్టం వివరాలు సేకరించాలని చెప్పారు. అలాగే వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం ఇస్తూ… అప్రమత్తం చేయాలన్నారు. తద్వారా పంట నష్టం తగ్గించగలిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు.
