AP Legislative Council: కుప్పం ఎమ్మెల్యే అంటూ సంబోధించిన వైసీపీ ఎమ్మెల్సీ..! శాసన మండలిలో రచ్చ..

  • శాసన మండలిలో టీడీపీ వర్సెస్ వైసీపీ..
  • సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ కుప్పం ఎమ్మెల్యే అంటూ..
  • వైసీపీ ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలపై దుమారం..
Ap Legislative Council

Ap Legislative Council

AP Legislative Council: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్దేశిస్తూ.. కుప్పం ఎమ్మెల్యే అంటూ వైసీపీ ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ చేసిన వ్యాఖ్యలు శాసన మండలిలో తీవ్ర దుమారాన్ని రేపాయి.. రమేష్ యాదవ్.. సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు మంత్రులు.. అయితే, ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించిన అనాటి కుప్పం ఎమ్మెల్యే అని మాత్రమే అన్నామని చెప్పుకొచ్చారు వైసీపీ పక్షనేత బొత్స సత్యనారాయణ.. ఇప్పుడు ముఖ్యమంత్రిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యే అనలేదని తెలిపారు.. ఇక, మాజీ సీఎం వైఎస్‌ జగన్ ను టీడీపీ వాళ్లు అనేక సార్లు పులివెందుల ఎమ్మెల్యే అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని సభ దృష్టికి తీసుకెళ్లారు బొత్స.. కావాలంటే రికార్డులు పరిశీలించుకోవాలని బొత్స సత్యనారాయణ సూచించారు..

Read Also: Zelenskyy: రష్యా తీరును ప్రపంచ దేశాలు ఖండించాలి.. యూఎన్‌లో జెలెన్‌స్కీ పిలుపు

మరోవైపు, వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని ప్యానెల్ చైర్మన్‌తో వాగ్వివాదానికి దిగారు మంత్రులు.. రమేష్ యాదవ్ ప్రసంగం కొనసాగడానికి వీలు లేదని అడ్డుకున్నారు మంత్రులు. దీంతో, సభలో గందరగోళం నెలకొంది.. ఇక, సభలో రికార్డుల పరిశీలన కోసం ఐదు నిమిషాల పాటు వాయిదా వేశారు శాసన మండలి చైర్మన్.. కాగా, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బలం 11 సీట్లకు పడిపోయిన తర్వాత.. ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది.. వైసీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఆ పార్టీ నేతలు డిమాండ్‌ చేస్తుండగా.. మరోవైపు, టీడీపీ సభ్యులు మాత్రం.. వైఎస్‌ జగన్‌ను ఉద్దేశిస్తూ.. పులివెందుల ఎమ్మెల్యే అంటూ సంబోధించిన సందర్భాలు ఉన్నాయి.. కానీ, ఓ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ఇప్పుడు.. ఆయన ప్రాతినిథ్యం వహిస్తోన్న నియోజకవర్గ ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించడం ఇప్పుడు వివాదానికి దారి తీసింది..