TDP Leadership Training Conclave: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న సమయంలో అన్ని రాజకీయ పార్టీలు లోకల్ బాడీ ఎలక్షన్స్పై ఫోకస్ పెడుతున్నారు.. అందులో భాగంగా.. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ స్థాయి నేతలకు నేటి నుంచి రెండు రోజుల పాటు ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించనున్నారు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ‘లీడర్షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ నేతలకు నాయకత్వం, పార్టీ కార్యక్రమాల నిర్వహణపై దిశానిర్దేశం చేయడం ప్రధాన ఉద్దేశంగా ఈ కాంక్లేవ్ను ఏర్పాటు చేశారు.
కాంక్లేవ్ను ఇంటరాక్టివ్ విధానంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్, పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాల అమలు, ప్రజలతో మరింత సమన్వయం వంటి అంశాలపై చర్చించనున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కాంక్లేవ్లో ప్రధాన అంశంగా ఉండనున్నాయి. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు, దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల సమాయత్తం, పార్టీ శ్రేణుల సమన్వయం, స్థానిక స్థాయిలో బలోపేతం వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. అలాగే ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం నిర్వహణపైనా నేతలతో చర్చించనున్నారు. రెండేళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో పార్టీ పనితీరును సమీక్షించడంతో పాటు, ప్రజల్లో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు అవసరమైన కార్యాచరణపై అధిష్ఠానం దృష్టి సారించింది.

