TDP Governor Quota MLC Race: రెండు ఎమ్మెల్సీ స్థానాలు.. 20 మందికిపైగా ఆశావహులు.. టీడీపీలో ఆసక్తికర సమీకరణాలు

CM Chandrababu

CM Chandrababu

TDP Governor Quota MLC Race: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఖాళీ కానున్న రెండు గవర్నర్ నామినేటెడ్ (గవర్నర్ కోటా) ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ముమ్మర కసరత్తు ప్రారంభించింది. కేవలం రెండు స్థానాలు మాత్రమే అందుబాటులో ఉండటంతో, 20 మందికిపైగా నేతలు ఈ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఎవరికి అవకాశం దక్కుతుందనే అంశంపై పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ సాగుతోంది.

అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఫోకస్‌ పెట్టారు.. సామాజిక, రాజకీయ, ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో పార్టీ కోసం త్యాగం చేసిన నాయకులు, రాజ్యసభ అవకాశం కోల్పోయిన సీనియర్లు, అలాగే పార్టీకి దీర్ఘకాలంగా సేవలందించిన వారికి ప్రాధాన్యం కల్పించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇప్పటికే పలువురు ఆశావహులు ముఖ్యమంత్రిని కలిసి తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని వినతిపత్రాలు సమర్పించినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్సీ రేసులో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలే ఎక్కువగా ఉండటం విశేషం. మాజీ మంత్రి వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, వంగవీటి రాధాకృష్ణ (రాధా), టీడీ జనార్దన్, బుద్ధా వెంకన్న పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. గోదావరి జిల్లాకు చెందిన క్షత్రియ సామాజిక వర్గ నాయకుడు మంతెన సత్యనారాయణరాజు కూడా ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఇక, రాయలసీమకు చెందిన ఒక నేతకు అవకాశం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ జాబితాలో రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి, తిప్పేస్వామి, బీటెక్ రవి, ప్రభాకర్ చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి.

ఇదే సమయంలో వికలాంగుల కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానం ఇస్తామని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తు చేస్తూ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అలాగే బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి సీనియర్ నేత ఏవీ రమణ కూడా ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. వీరివెంట కొమ్మాలపాటి శ్రీధర్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ, మంగళగిరి సీనియర్ నేత పోతినేని శ్రీనివాసరావు, పనబాక లక్ష్మి, జంగా కృష్ణమూర్తి, దారు నాయక్ తదితరులు కూడా ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.

రెండు స్థానాలకు భారీగా పోటీ ఉండటంతో తుది నిర్ణయం ఎలా ఉండబోతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. సామాజిక సమతుల్యత, ప్రాంతీయ ప్రాతినిధ్యం, పార్టీ పట్ల విధేయత, గతంలో చేసిన సేవలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు నాయుడు తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులు ఎవరిని వరించనున్నాయనే అంశం టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.