AP Liquor Scam Case: లిక్కర్‌ కేసులో సిట్‌ దూకుడు.. వారి అరెస్ట్‌లపై ఫోకస్‌

  • ఏపీ లిక్కర్‌ కుంభకోణం కేసులో సిట్ దూకుడు..
  • నిందితుల అరెస్టులపై సిట్ అధికారులు ఫోకస్..
  • ఇప్పటికే 9 మంది నిందితులను అరెస్టు..
Ap Liquor Scam Case

Ap Liquor Scam Case

AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రకంపనలకు కారణమైన లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు సిట్‌ అధికారలుఉ… నిందితుల సంఖ్య మాత్రం 39కి చేరుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నిందితుడుగా చేరుస్తూ దాఖలు చేసిన మెమాలో కొత్తగా ఆరుగురిని నిందితులుగా చూపించారు. వారిలో చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడులను అరెస్ట్ చేశారు. మిగతా నలుగురు నిందితులను అరెస్టు చేయటానికి సిట్ అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

Read Also: Brahmanandam: కన్నప్ప సినిమాని ఆదరించండి…అల్లరి చేయకండి !

కొత్తగా నిందితులుగా చేర్చిన ఆరుగురిలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి ఒకరు కాగా… ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి కూడా ఉన్నారు. మిగతా అందరూ చెవిరెడ్డి సన్నిహితులే. ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, నవీన్ కృష్ణ, హరీష్, బాలాజీ అజ్ఞాతంలోకి వెళ్లారు. దీంతో వీరిని పట్టుకోవడానికి ఏడు టీమ్‌లను సిట్‌ ఏర్పాటు చేసింది. ఈ బృందాలు బెంగళూరు, హైదరాబాద్ సహా మూడు రాష్ట్రాల్లో నిందితుల కోసం గాలిస్తున్నాయి. నిందితుల సెల్‌ఫోన్‌ ట్రాకింగ్‌, ఆర్థిక లావాదేవీల ఆధారంగా గాలింపు చర్యలను ముమ్మరం చేసింది సిట్‌. చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి అరెస్టుకు ముందు ఆయన దగ్గర పనిచేసిన గన్‌మెన్‌ మదన్ రెడ్డిని సిట్ విచారించింది. సరిగ్గా భాస్కర్‌ రెడ్డి అరెస్టు ముందురోజే సిట్ అధికారులపై మదన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తనను బెదిరించడంతోపాటు, దాడి చేసి స్టేట్‌మెంట్‌ రికార్డ్ చేశారని సిట్ అధికారులపై సీఎం, డీజీపీకి లేఖలు రాశారు. ఈ లేఖలు కలకలం రేపాయి. దీంతో పారదర్శక విచారణ చేస్తున్నామని సిట్ ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. దీంతో వీలైనంత త్వరగా అరెస్టుల వ్యవహారాన్ని ముగించాలనే నిర్ణయానికి సిట్ అధికారులు వచ్చారు.

Read Also: IndiGo Flight: ఎగురుతున్న ఇండిగో విమానంలో ఇంధనం కొరత.. పైలెట్ ‘మేడే కాల్‌’.. చివరకీ..

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడుల 5 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. వీరిని వచ్చేవారం కస్టడీకి ఇచ్చే అవకాశాలున్నాయి. కస్టడీకి ఇస్తే ముడుపుల వ్యవహారంతో పాటు ఎన్నికల్లో ఎక్కడెక్కడ ఆ డబ్బును వినియోగించారని అంశాలను కూడా తెలుసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే కొంత సమాచారం, ఆధారాలు సేకరించినప్పటికీ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని ప్రశ్నించడం ద్వారా కీలక విషయాలతోపాటు, మరికొందరు నిందితుల గురించిన విషయాలు బయటకు వచ్చే అవకాశాలున్నాయి.