Andhra Pradesh Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలోని వాయుగుండం రాగల 24 గంటల్లో తీవ్రవాయుగుండంగా బలపడనుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం, వచ్చే 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని.. ప్రస్తుతం పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ నైరుతి బంగాళాఖాతం వైపు ప్రయాణిస్తోందని పేర్కొంది..
Read Also: Minister Seethakka: యుద్ధ ప్రాతిపదికన మేడారం ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేశాం..!
తీవ్ర వాయుగుండంతో రాష్ట్రంపై ప్రత్యక్ష ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ.. నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో శనివారం, ఆదివారం రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అయితే, రాష్ట్రంలో రాగల 48 గంటలు పొడి వాతావరణం కొనసాగుతుంది. ఉదయం వేళల్లో కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.. వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగి, చలి ప్రభావం తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి.