Sai Krishna Missing Case: సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తులో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసులో భాగంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్పై ఏసీపీ దైవ ప్రసాద్ నేతృత్వంలోని బృందం ప్రత్యేక దృష్టి సారించింది. సాయికృష్ణను మార్కాపురం నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారని అతని తల్లి విజయలక్ష్మి ఆరోపిస్తున్న నేపథ్యంలో, ఆమె పేర్కొన్న తేదీలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన సిబ్బందిని ఏసీపీ దైవ ప్రసాద్ బృందం పూర్తిస్థాయిలో విచారిస్తోంది. సాయికృష్ణ తల్లి చెబుతున్న తేదీల్లో డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్కరి వివరాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో లేని సిబ్బంది ఎక్కడ ఉన్నారు, ఎప్పుడు విధుల్లోకి వస్తారు అనే సమాచారాన్ని కూడా అధికారులు తెలుసుకుంటున్నారు.
అంతేకాకుండా, మే నెలకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను బ్యాకప్ చేయాలని స్టేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అధికారులు ముందుకు సాగుతున్నారు. మరోవైపు, సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీ కేసులో కృష్ణలంక స్వర్గపురిలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు. సాయికృష్ణను హత్య చేసి అక్కడే దహనం చేశారని అతని తల్లి విజయలక్ష్మి చేసిన ఆరోపణల నేపథ్యంలో అధికారులు స్వర్గపురి ప్రాంతాన్ని పరిశీలించారు.
విచారణ సందర్భంగా స్వర్గపురిలోని సీసీటీవీ ఫుటేజ్ను ఇవ్వాలని అక్కడి సిబ్బందిని పోలీసులు కోరారు. అయితే ఇప్పటివరకు ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని, ప్రస్తుతం వాటిని ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నామని సిబ్బంది తెలిపారు. మే 20 నుంచి మే 29 వరకు ఏవైనా ఫుటేజ్లు అందుబాటులో ఉంటే ఇవ్వాలని పోలీసులు కోరినప్పటికీ, అలాంటి రికార్డులు లేవని సిబ్బంది సమాధానం ఇవ్వడంతో అధికారులు వెనుదిరిగారు. దీంతో సాయికృష్ణ అదృశ్యం కేసులో దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది. సాయికృష్ణ కేసులో వాస్తవాలు వెలుగులోకి తీసుకురావడానికి అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని, అందుబాటులో ఉన్న ప్రతి ఆధారాన్ని పరిశీలిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

