Deputy CM Pawan Kalyan: రాజమండ్రిలో గోదావరి కాలుష్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్ కాలుష్యం చేస్తూనే స్థానిక సంస్థలకు పన్నులు చెల్లించకుండా కాలయాపన చేస్తోందని ఆయన మండిపడ్డారు. దాదాపు రూ.21.34 కోట్ల పన్ను బకాయిలు ఉన్నప్పటికీ, పన్ను చెల్లించమని నోటీసులు ఇచ్చిన ప్రతిసారీ కోర్టులను ఆశ్రయిస్తూ ఆలస్యం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు.
2016 తర్వాత పన్ను చెల్లించలేదా?
ఆంధ్రా పేపర్స్ 2016 తర్వాత కాతేరు గ్రామ పంచాయతీకి గానీ, రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్కు గానీ ఒక్క రూపాయి పన్ను కూడా చెల్లించలేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా సంస్థ తనకు తానే పన్ను మినహాయింపు ఇచ్చుకున్నట్టుగా వ్యవహరించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇచ్చినా సంస్థ నుంచి స్పందన రాలేదని అన్నారు.
రాజమండ్రి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్స్దే
రాజమండ్రి మొత్తం దాదాపు 70 మిలియన్ లీటర్ల ద్రవ వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే, అందులో సుమారు 35 మిలియన్ లీటర్లు ఆంధ్రా పేపర్స్ నుంచే వెలువడుతున్నాయని పవన్ తెలిపారు. దీంతో గోదావరి నది సహజ పర్యావరణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రా పేపర్స్ లగూన్స్ వద్ద సేకరించిన నమూనాలను పరీక్షించగా లీటర్ నీటికి 36 మిల్లీగ్రాముల బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BOD) నమోదైందని పవన్ వెల్లడించారు. ఇది నిర్ణీత ప్రమాణాల కంటే 20 శాతం అధికమని తెలిపారు. ఫాస్ఫేట్ 5.3 మిల్లీగ్రాములు ఉండగా, ఇది 6 శాతం అధికమని, సల్ఫైడ్స్ 3.4 మిల్లీగ్రాములు ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలతో పోలిస్తే సల్ఫైడ్స్ స్థాయి 70 శాతం అధికంగా ఉందని తెలిపారు.
కఠిన చర్యలకు ఆదేశాలు
కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడితే పరిశ్రమ కార్యకలాపాలను నిలిపివేయడం, పెనాల్టీలు విధించడం, కంపెనీని సీజ్ చేయడం, అవసరమైతే లైసెన్స్ రద్దు చేయడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. కాలుష్య నియంత్రణ మండలి తక్షణమే ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్కు సమన్లు జారీ చేసి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్, అదనపు అడ్వకేట్ జనరల్తో పాటు ప్రభుత్వ న్యాయవాదులు, స్టాండింగ్ కౌన్సిళ్లు ఇటువంటి ఉల్లంఘనలకు సంబంధించిన కేసుల విచారణను త్వరితగతిన పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
పన్ను బకాయిలపై పవన్ ప్రశ్నలు
ఆంధ్రా పేపర్స్ పన్ను చెల్లించి దాదాపు పుష్కరకాలం పూర్తయిందని పవన్ వ్యాఖ్యానించారు. పన్ను చెల్లించమంటే కోర్టులను ఆశ్రయిస్తూ కాలయాపన చేయడం ఎందుకని ప్రశ్నించారు. స్థానిక సంస్థలకు దాదాపు రూ.21.34 కోట్ల వరకు పన్నులు చెల్లించాల్సి ఉందని తెలిపారు. కాలుష్యం కారణంగా గోదావరి నది సహజ పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటోందని, దీనిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
రాజమండ్రి గోదావరి కాలుష్యంలో సగం ఆంధ్రా పేపర్ లిమిటెడ్దే
•కాలుష్యం చేస్తూ ఉత్పత్తి చేస్తున్నారు.. పన్ను మాత్రం ఎగ్గొడుతున్నారు..
•ఆంధ్రా పేపర్ మిల్స్ పన్ను కట్టి దాదాపు పుష్కరకాలం పూర్తయ్యింది
•పన్ను చెల్లించమంటే కోర్టులకెళ్లి కాలయాపన చేస్తారా? ఇంత బాధ్యతారాహిత్యం ఎందుకు?… pic.twitter.com/UDMipMrFJh— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) September 4, 2026

