Nara Lokesh: పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య శాఖలపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. విద్యారంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాల పురోగతి, విద్యార్థుల చేరికలు, మధ్యాహ్న భోజన పథకం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ‘అక్షర ఆంధ్ర’ కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. వచ్చే ఏడాదికి రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత దిశగా తీసుకెళ్లేందుకు మరింత వేగంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అక్షర ఆంధ్ర కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని మంత్రి సూచించారు. ప్రజాప్రతినిధుల సహకారంతో అక్షరాస్యత కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విస్తృతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. అలాగే బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు చొరవ చూపాలని నారా లోకేష్ ఆదేశించారు. ప్రతి చిన్నారికి విద్య అందేలా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
మధ్యాహ్న భోజన పథకం అమలుపైనా మంత్రి నారా లోకేష్ సమీక్షించారు. పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యత, పథకం అమలుపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి క్రమం తప్పకుండా ఫీడ్బ్యాక్ తీసుకోవాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాల అమలుపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్..

