NTV Telugu Site icon

NTR Bharosa Pensions: రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ.. 2.30 గంటల్లోనే..!

Pensions

Pensions

NTR Bharosa Pensions: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరుగుతోంది.. ఉదయం 8.30 గంటల వరకే 63.66 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు అధికారులు.. మొత్తం 64.82 లక్షల లబ్దిదారులకు గాను ఇప్పటి వరకు 41.26 లక్షల మందికి పింఛన్ల పంపిణీ పూర్తి అయ్యిందని అధికారులు చెబుతున్నారు.. లబ్దిదారులకు ఉదయం 6 గంటల నుంచి సచివాలయ ఉద్యోగులు ద్వారా రూ. 1739 కోట్లు పంపిణీ చేశారు.. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండున్నర గంటల్లోనే దాదాపు 64.66 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయడం రికార్డుగా చెబుతున్నారు.. పెన్షన్ల పంపిణీని వలంటీర్ల కంటే స్పీడుగా పంపిణీ చేస్తోన్నారు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు. రెండు రోజుల్లోనే పెన్షన్ల పంపిణీని ఉద్యోగుల ద్వారా పూర్తి చేసేస్తోంది కూటమి ప్రభుత్వం.

Read Also: Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

అయితే, పెన్షన్ల పంపిణీని పూర్తి చేయడానికి వారం రోజుల సమయం తీసుకుంది గత వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ సర్కార్.. కానీ, గత ప్రభుత్వం కంటే తక్కువ మంది సిబ్బందితోనే పెన్షన్ల పంపిణీని ప్రణాళికా బద్దంగా చేపడుతోంది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్. ఇంటింటికీ వెళ్లి లబ్దిదారులకు పింఛన్లు అందజేస్తున్నారు.. దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు పింఛన్ దారులు. గత నెల పెండింగ్ పెన్షన్‌తో కలిపి రూ. 7 వేలు ఇచ్చిన ప్రభుత్వం. ఈ నెల నుంచి రూ. 4 వేల పెన్షన్ పంపిణీ చేపడుతోంది ప్రభుత్వం.. మరోవైపు.. ఈ రోజు మడకశిరలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.. జిల్లాల్లో పెన్షన్ పంపిణీలో పాల్గొంటున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు.. ప్రజాప్రతినిధులు..