CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. మంత్రులు, నియోజకవర్గాల వారీగా ఎన్నికల పరిశీలకులు, పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో సమాయత్తం కావాలని చంద్రబాబు సూచించారు.

అసెంబ్లీ కంటే మెరుగైన స్ట్రైక్‌రేట్ లక్ష్యం
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరింత మెరుగైన స్ట్రైక్‌రేట్ సాధించాలని చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. 2024 ఎన్నికలతో పోల్చుకుంటే ప్రస్తుతం పార్టీ ఎక్కడ ఉందో అంచనా వేసుకునేందుకు స్థానిక ఎన్నికలు మంచి అవకాశమని తెలిపారు. టీడీపీ తొలిసారిగా కూటమిగా స్థానిక ఎన్నికలను ఎదుర్కొంటున్నందున భాగస్వామ్య పార్టీల మధ్య ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యాప్ రాకుండా చూడాలని సూచించారు.

కూటమి సమన్వయంతో ముందుకు
ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలతో సమన్వయం చేసుకుంటూ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని చంద్రబాబు అన్నారు. కూటమి పార్టీలతో సమన్వయంతో పాటు టీడీపీలోనూ పాత, కొత్త నేతలు, కార్యకర్తలు కలిసి పనిచేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, సానుకూల అజెండాతో ఎన్నికలకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఇక, అభ్యర్థుల ఎంపికలో యువత, మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రజలు, కార్యకర్తల ఆమోదంతో పాటు అభ్యర్థుల పనితీరును పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేపడతామన్నారు. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులను ఎంపిక చేస్తే ప్రజలు కూడా ఆ నిర్ణయాన్ని అర్థం చేసుకుని మద్దతు ఇస్తారని పేర్కొన్నారు.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కచ్చితంగా 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. అవసరమైతే 34 శాతానికి మించి సీట్లు కేటాయిస్తామని, కానీ ఒక్క శాతం కూడా తగ్గించబోమని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై కొందరు కోర్టును ఆశ్రయించినప్పటికీ, ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తోందన్నారు. 1995లో రూపొందించిన చట్టం ప్రకారం 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. మరోవైపు.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని చంద్రబాబు చెప్పారు. సంక్షేమ అమలులో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించేలా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

వెలిగొండ, పోలవరం ప్రాజెక్టులపై ప్రస్తావన
వెలిగొండ ఫేజ్-1ను ప్రారంభించడం చారిత్రాత్మక విజయమని చంద్రబాబు అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి మార్గం సుగమం చేసేలా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్‌ను ప్రారంభించి అనకాపల్లికి నీటిని తీసుకెళ్లామని తెలిపారు. హంద్రీ-నీవా కాల్వల ద్వారా రాయలసీమలో చివరి ప్రాంతాలకూ నీరందించే చర్యలు చేపట్టామన్నారు. 2019లో ప్రభుత్వం కొనసాగి ఉంటే ఇప్పటికే నదుల అనుసంధానం పూర్తయ్యేదని, నదుల అనుసంధానం ద్వారా ఎల్‌నినో వంటి విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు. ఇక, భోగాపురం విమానాశ్రయం, వెలిగొండ ప్రాజెక్టు, పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ప్రారంభోత్సవాల తరహాలో స్టేక్‌హోల్డర్లను భాగస్వాములను చేస్తూ కార్యక్రమాలు నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు పార్టీ యంత్రాంగం చురుగ్గా పనిచేయాలని అన్నారు.

ఫేక్ ప్రచారాన్ని తిప్పికొట్టాలి
ప్రతిపక్ష పార్టీ కుట్రలు, కుతంత్రాలను నిరంతరం గమనిస్తూ వాటిని ప్రజల్లోకి వెళ్లకుండా తిప్పికొట్టాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. తప్పుడు ప్రచారాన్ని సమర్థంగా ఎదుర్కోవాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన అంశాలపై కోర్టులను ఆశ్రయిస్తూ ఎన్నికలు జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రానికి నిధులు రాకుండా చూసేందుకు కూడా కుట్రలు జరుగుతున్నాయని పార్టీ శ్రేణులకు వివరించారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు మరింత సన్నద్ధం చేసేందుకు ఈ నెల 7, 8 తేదీల్లో పార్టీ కార్యాలయంలో లీడర్‌షిప్ ట్రైనింగ్ కాంక్లేవ్ నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు. స్థానిక ఎన్నికలను కూటమి సమన్వయంతో, సానుకూల ప్రచారంతో ఎదుర్కొని మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పార్టీ యంత్రాంగం పనిచేయాలని దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు..