CM Chandrababu: అమరావతి రాజధాని నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నిర్దేశించుకున్న సమయానికి పనులు పూర్తి చేసి ప్రధానితో ప్రారంభోత్సవం చేస్తామని.. ఈ మేరకు పనులు వేగంగా చేపట్టి పూర్తి చేసేలా కాంట్రాక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు అధికారులు కూడా పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. రాజధాని నిర్మాణ పనులను ఓ కాంట్రాక్ట్ వర్క్ అన్నట్టుగా భావించవద్దని.. చరిత్రలో భాగస్వాములు అవుతున్నట్టుగా భావించాలన్నారు. శనివారం క్యాంప్ కార్యాలయంలో రాజధానిలో నిర్మాణ పనులు చేపట్టిన వివిధ కాంట్రాక్టు సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. ప్రస్తుతం రాజధానిలో వివిధ దశల్లో రూ.57,821 కోట్ల విలువైన పనులు ఉండగా… వాటిలో రూ. 50, 943 కోట్ల పనులు గ్రౌండ్ అయ్యాయని అధికారులు సీఎంకు వివరించారు.
హౌసింగ్, రోడ్లు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎల్పీఎస్ మౌళిక సదుపాయలతో పాటు అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం వంటి ఐకానిక్ భవనాల నిర్మాణ పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. ప్రస్తుతం రాజధాని నిర్మాణ పనుల్లో మొత్తంగా 20 వేల మంది కార్మికులు, నిపుణులు పని చేస్తున్నారని అధికారులు తెలిపారు. అలాగే ఏ నిర్మాణ సంస్థ ఎంత మేర పనులు చేసింది.. లక్ష్యాన్ని ఎంత మేరకు చేరుకున్నారనే విషయంలో పనుల వారీగా సీఎం చర్చించారు. పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థల తీరు పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిర్మాణ పనులకు అవసరమైన మ్యాన్ పవర్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని కాంట్రాక్టర్లు సీఎం దృష్టికి తెచ్చారు. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా చాలా మంది కార్మికులు వెళ్లారని నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెప్పారు. స్థానికంగా నైపుణ్యమున్న మ్యాన్ పవర్ ఎంత వరకు అందుబాటులో ఉంటుందో చూసి వినియోగించుకోవాలని సీఎం సూచించారు. రాజధాని పనుల్లో ఎంత మెషినరీని వినియోగిస్తున్నారనే అంశం పైనా సీఎం ఆరా తీశారు. రాజధాని పనుల్లో 5,580 మెషినరీ అవసరముండగా… ప్రస్తుతం 3767 మెషనరీ ఉందని అధికారులు వివరించారు. ఇవి కాకుండా హాట్ మిక్స్ 16, వెట్ మిక్స్ మెషిన్లు 36, ఆర్ఎంసీ మిషన్లు 34 ఉన్నాయని తెలిపారు.
అయితే, వారం, నెల వారీగా టార్గెట్లు పెట్టుకుని రాజధాని పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను… నిర్దేశించుకున్న టార్గెట్లను విశ్లేషిస్తే… వారానికి రూ. 941 కోట్ల విలువైన పనులు పూర్తి కావాల్సి ఉందని ముఖ్యమంత్రి అన్నారు. వచ్చే వర్షా కాలంలో పనులకు ఆటంకం కలిగే అవకాశం ఉంది కాబట్టి.. ఆలోగానే చేపట్టాల్సిన పనులను జాప్యం లేకుండా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఎక్కువ ప్రాజెక్టులను చేపడుతున్న నిర్మాణ సంస్థలు మరింతగా దృష్టిని కేంద్రీకరించి పనులు చేయాలన్నారు. రాజధాని నిర్మాణానికి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”రాజధాని నిర్మాణమనేది కేవలం ఒక కాంట్రాక్ట్ వర్క్గా చూడొద్దు… ఇప్పుడు పనులు చేపట్టే వారంతా చరిత్రలో భాగస్వాములు అవుతున్నట్టే.. నిర్మాణ సంస్థలుగా ఎన్నో ప్రాజెక్టులు చేసి ఉంటారు. కానీ రాజధాని నగరాన్ని నిర్మించే అవకాశం అందరికీ దక్కదు. రాజధానిని అద్భుతంగా, వినూత్నంగా నిర్మించేందుకు అపార అవకాశాలున్నాయి. అమరావతిని ఫ్యూచర్ సిటీగా నిర్మించాలనే ప్రభుత్వ ఆలోచనను క్షేత్రస్థాయిలో అమలు చేసి చూపాలి. నాణ్యతతో నిర్మాణాలు ఉండాలి… కాస్ట్ ఎఫెక్టివ్ చర్యలు తీసుకోవాలి. గ్రీన్ ఎనర్జీ, టెక్నాలజీ వంటి వాటిని వినియోగించుకోవాలి. రాజధాని ప్రతిష్టను పెంచేలా ఎవరికైనా ఆలోచనలు వస్తే వాటిని ప్రభుత్వంతో పంచుకోవచ్చు. ప్రభుత్వం నిర్ధేశించిన సమయానికి నిర్మాణం పూర్తి చేసి తీరాల్సిందే.. ఈ విషయంలో ఏ మాత్రం రాజీ ఉండదు. మ్యాన్ పవర్ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది… ప్రతీ నిర్మాణం సకాలంలో పూర్తి చేసి ప్రారంభించుకోవాలి” అని ముఖ్యమంత్రి చెప్పారు.
నిర్మాణ సామాగ్రికి రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యమెందుకు…?
సమీక్ష సందర్భంగా ఇటీవల రాజధాని ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదాల ఘటన ప్రస్తావనకు వచ్చింది. నిర్మాణ సామాగ్రికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కాంట్రాక్టు సంస్థలకు లేదా అంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ సంస్థల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయన్నారు. ఘటన జరిగిన తర్వాత కాంట్రాక్టు సంస్థలు కానీ… అధికారులు కానీ తగిన రీతిలో స్పందించలేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతీ అంశాన్ని వక్రీకరించేలా కొందరు రాజకీయం చేస్తున్నారని… ఇలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు. జరగరాని ఘటనలు జరిగితే వెంటనే అలర్ట్ చేయాలని ఆదేశించారు. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా… ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు.. బురద జల్లేందుకు, కుట్రలు పన్నేందుకు కొందరు సిద్దంగా ఉన్నారని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఆయా నిర్మాణ సంస్థలు కూడా ప్రాజెక్టు మేనేజర్లుగా సమర్థులను నియమించుకోవాలని సూచించారు. సరైన వాళ్లని నియమించుకోకుంటే… ఆ ప్రభావం ప్రభుత్వంపై పడుతుందని.. దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తాను అనుమతించనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా కలెక్టర్లకు ఆదేశాలు
రాజధాని పనులకు అవసరమైన ఇసుక, గ్రావెల్ సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇసుక, గ్రావెల్ కొరత కారణంగా నిర్మాణ పనుల్లో జాప్యం జరిగే పరిస్థితి రాకూడదని సీఎం స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలో ఫారెస్ట్ అధికారుల కారణంగా గ్రావెల్ సరఫరాలో కొంత ఇబ్బంది ఉందని.. జిల్లా కలెక్టర్ పరిస్థితిని అర్థం చేసుకుంటున్నా… ఫారెస్ట్ అధికారులతోనే అసలు సమస్య వస్తోందనే విషయం సమావేశంలో సీఎం దృష్టికి వచ్చింది. దీనిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణ పనులకు అవసరమైన ఇసుక, గ్రావెల్ వంటివి గ్రీన్ ఛానెల్ ద్వారా వెళ్లాలని.. ఎవరి ఒత్తిళ్లకూ గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరకు కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడాలని ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.