CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Cbn

Cbn

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికలు, ఎల్‌నినో ప్రభావం, కరువు పరిస్థితులు, ప్రభుత్వ పథకాల ప్రచారం, నిత్యావసర ధరల నియంత్రణ తదితర అంశాలపై కీలక సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ఆదేశాలు
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉన్న న్యాయపరమైన సమస్యలన్నింటినీ పరిష్కరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. కోర్టు పరిధిలో ఉన్న 23 మున్సిపాలిటీలతో పాటు మొత్తం 100 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు.

ఎల్‌నినోపై కేబినెట్‌లో సుదీర్ఘ చర్చ
ఎల్‌నినో ప్రభావం, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో వర్షాలు మైనస్ 52 శాతం నమోదైన నేపథ్యంలో తాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం ఆదేశించారు. సీడ్ బాల్స్ కార్యక్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా నిధులు రాబట్టాలనే అంశంపైనా మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. వెలిగొండ, పోలవరం ఎడమ కాలువకు నీరు అందించడంపై సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడితో పాటు ఇంజనీరింగ్ అధికారులను అభినందించారు.

ప్రజల్లోకి మంత్రులు వెళ్లాలి
మంత్రులందరూ ప్రజల్లోకి వెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. “మనం ఇన్ని పనులు చేస్తున్నాం.. వీటన్నింటినీ ప్రజలకు చెప్పుకోవాలి” అని మంత్రులకు సూచించారు. కొత్త తరం జెన్‌-జెడ్ యువత అన్ని విషయాలపై అవగాహనతో ఉందని, సోషల్ మీడియాలో వారు చురుకుగా ఉంటున్నారని సీఎం పేర్కొన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మంత్రులు, పార్టీ శ్రేణులు కూడా సిద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను జెన్‌-జెడ్ యువతకు చేరవేయాలని చెప్పారు.

వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. తప్పుడు, ఫేక్ ప్రచారాలు చేయడంలో వైసీపీ ముందుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. వెలిగొండ, పోలవరం ఎడమ కాలువకు నీటి విడుదల విషయంలోనూ వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని సీఎం అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులపై వాస్తవాలను ప్రజలకు వివరించాలని, ఈ ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు పూర్తయినా అది తమ ప్రభుత్వ హయాంలోనే పూర్తయినదని, ఈ విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

నిత్యావసర ధరలపై ప్రత్యేక దృష్టి
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను కూడా నియంత్రించాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అన్నారు. ధరల నియంత్రణపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్‌కమిటీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు నిత్యావసర ధరల పెరుగుదలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..