CM Chandrababu: అమరావతిలోని రాయపూడి పరేడ్ గ్రౌండ్స్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. దేశం మనకు హక్కులు, గుర్తింపు, గౌరవం ఇచ్చిందని, ఇప్పుడు దేశానికి మనం ఏం చేయగలమో ఆలోచించాల్సిన సమయం వచ్చిందని అన్నారు.
దేశమే నా బాధ్యత.. ప్రతి ఒక్కరిలో సంకల్పం ఉండాలి
దేశం మనకు ఎంతో ఇచ్చిందని, అందుకే “దేశమే నా బాధ్యత” అనే ఆలోచనతో ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరి చేతిలో జాతీయ జెండా ఉండటంతో పాటు, గుండెల్లో బలమైన అజెండా ఉండాలని అన్నారు. అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు వచ్చే 20 ఏళ్లకు అనుసంధానమైన ప్రణాళికతో పనిచేస్తామని ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంకల్పం తీసుకోవాలని సూచించారు. దేశానికి మనం ఏం ఇవ్వగలం అనే ఆలోచనే “అనే నేను..” అనే సంకల్పానికి మూలమని పేర్కొన్నారు.
సమాజ హితం కోసం పనిచేయాలి
తాము చేసే ప్రతి పని దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, సమాజ హితం కోసం ఉండాలని చంద్రబాబు అన్నారు. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరికీ భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు. విద్యార్థులు తమ నైపుణ్యాలను ఉపయోగించి ఆవిష్కరణలు సాధించాలని, రైతులు ప్రకృతి సాగు ద్వారా ప్రజల ఆరోగ్యంతో పాటు భూసారాన్ని కాపాడాలని సూచించారు. ఉద్యోగులు అంకితభావంతో పనిచేస్తూ సమాజం పట్ల తమ బాధ్యతను నెరవేర్చాలని అన్నారు. మహిళలు అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారత సాధించాలని పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తి తన వ్యక్తిగత జీవితంలో విజయం సాధించడం ద్వారా దేశ నిర్మాణంలో భాగస్వామి కావాలని సూచించారు.
ఆలోచన చిన్నదైనా.. సంకల్పం గొప్పగా ఉండాలి
ఒక వ్యక్తిగా తమ ఆలోచన చిన్నదిగా ఉన్నప్పటికీ, దేశం కోసం చేసే సంకల్పం మాత్రం గొప్పదిగా ఉండాలని చంద్రబాబు అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలకు మించి దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేసినప్పుడే సమాజం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని నిర్దేశించారని చంద్రబాబు తెలిపారు. భారతదేశం స్వయంసమృద్ధి సాధించడంతో పాటు, ఆ లక్ష్యానికి బలమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదగాలని ఆకాంక్షించారు. దేశం కోసం మనం చేసే ప్రతి పని స్వయంసమృద్ధి నిర్మాణంలో భాగమని, స్వయంసమృద్ధి కోసం చేసే ప్రతి ప్రయత్నం వికసిత్ భారత్ నిర్మాణానికి దోహదపడుతుందని అన్నారు. అందరూ ఒక్కటిగా, బాధ్యతగా పనిచేసి స్వయంసమృద్ధిని నిర్మించాలని, వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయాలని పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలంతా దృఢమైన సంకల్పం తీసుకోవాలని సీఎం కోరారు.
ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న స్వతంత్ర భారత్
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని చంద్రబాబు గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ కూడా అనేక రాజకీయ, సామాజిక, ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొందన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు. ఆయన త్యాగాల ఫలితంగా 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం నుంచి రాష్ట్ర విభజన వరకు
1956 నవంబర్ 1న హైదరాబాద్ రాజధానిగా తెలంగాణతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని చంద్రబాబు పేర్కొన్నారు. అనంతరం 2014లో మరోసారి రాష్ట్ర విభజన జరిగిందని గుర్తుచేశారు. విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ అనేక ప్రత్యేక సమస్యలు, సంక్షోభాలను ఎదుర్కొన్నప్పటికీ ప్రజలు పట్టుదలతో నిలిచారని అన్నారు. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించిన విషయాన్ని ప్రస్తావించారు. 2019లో రాజకీయ పరిణామాలు మారి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చంద్రబాబు అన్నారు. అనంతరం రాష్ట్రంలో పాలనాపరమైన మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. గత పాలనలో అవినీతి, అక్రమాలు, అవినీతి ఆరోపణలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, దాదాపు 30 ఏళ్ల వెనుకబడిన పరిస్థితిని ఎదుర్కొందని ఆయన ఆరోపించారు. ఆర్థికంగా కూడా రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బ తగిలిందని వ్యాఖ్యానించారు.
2024లో ప్రజల తీర్పు.. పునర్నిర్మాణానికి బాధ్యత
2024లో జరిగిన ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుగా నిలిచాయని చంద్రబాబు అన్నారు. నరేంద్ర మోదీ, పవన్ కల్యాణ్, చంద్రబాబు కలిసి ప్రజల ముందుకు వచ్చారని తెలిపారు. “ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలవాలి” అనే నినాదంతో కూటమి ఎన్నికలను ఎదుర్కొందని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉందని, కూటమికి 94 శాతం సీట్లు, 57 శాతం ఓటింగ్తో ప్రజలు మద్దతు ఇచ్చారని వివరించారు.
అధికారంగా కాకుండా బాధ్యతగా తీర్పును స్వీకరించాం
ప్రజల తీర్పును అధికారంగా భావించకుండా రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజలు అప్పగించిన బాధ్యతగా స్వీకరించామని చంద్రబాబు అన్నారు. పాలకులుగా కాకుండా ప్రజలకు సేవకులుగా పనిచేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
26 నెలల్లో మూడు కానుకలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 26 నెలల వ్యవధిలో ప్రజలకు మూడు ప్రధాన కానుకలు అందించామని చంద్రబాబు పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి, స్థిరత్వాన్ని సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రాన్ని కేవలం అభివృద్ధి చేయడం మాత్రమే కాకుండా.. వికసితం నుంచి వైభవం వైపు, సంక్షేమం నుంచి స్థిరత్వం వైపు, అభివృద్ధి నుంచి అత్యున్నత స్థాయి వైపు తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
వికసిత్ భారత్కు బలమైన రాష్ట్రంగా ఏపీ
ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. వ్యక్తిగత బాధ్యత, సామాజిక బాధ్యత, రాష్ట్ర బాధ్యత, దేశ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగితేనే వికసిత్ భారత్ లక్ష్యం సాకారం అవుతుందని అన్నారు. జాతీయ జెండా చేతిలో.. దేశ నిర్మాణ సంకల్పం గుండెల్లో.. వచ్చే 20 ఏళ్ల లక్ష్యంతో ముందుకు సాగుతూ స్వయంసమృద్ధి కలిగిన ఆంధ్రప్రదేశ్ను నిర్మించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

