NTV Telugu Site icon

AP Floods Damage: ఏపీలో వరద నష్టంపై ముగిసిన కేంద్ర బృందం భేటీ.. శాఖలవారీగా వివరాల సేకరణ..

Vijayawada Floods

Vijayawada Floods

AP Floods Damage: ఆంధ్రప్రదేశ్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి.. ఆ నష్టాన్ని అంచనా వేసేందుకు రాష్ట్రానికి చేరుకున్నాయి సెంట్రల్‌ టీమ్స్.. రాగానే మొదట.. రాష్ట్ర అధికారులతో సమావేశమై.. వరదల తీవ్రత.. నష్టంపై చర్చించారు.. దాదాపు రెండు గంటల పాటు ఏపీ అధికారులతో సమావేశమైంది కేంద్ర బృందం. ఇక, కాసేపట్లో క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లనున్నాయి కేంద్ర బృందాలు.. బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో కేంద్ర బృందాల పర్యటన కొనసాగనుంది.. ఇవాళ బాపట్ల, కృష్ణా జిల్లాల్లో సెంట్రల్ టీమ్స్ పర్యటించనుండగా.. రేపు ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తూ.. వరద నష్టంపై ఆరా తీయనున్నారు..

Read Also: TGVishwaPrasad : పారాలింపిక్స్‌లో అంధుల క్రికెట్‌ను చేర్చేందుకు అన్ని విధాలా కృషి చేయాలి

ఇక, ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ.. ఏపీలో జరిగిన వరద నష్టంపై అంచనాకు కేంద్ర బృందం వచ్చిందని తెలిపారు.. ఏపీలో వరద నష్టంపై శాఖలావారీగా వివరాలు అందించామన్న ఆయన.. వరద సహాయక చర్యలు ఏం తీసుకున్నామో చెప్పాం. ప్రాథమిక అంచనా ప్రకారం నష్టం ఎంత వచ్చిందో కూడా వివరించామని వెల్లడించారు.. క్షేత్ర స్థాయిలో రెండు సెంట్రల్‌ టీమ్స్ పర్యటిస్తాయి. ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో క్షేత్ర స్థాయిలో సెంట్రల్ టీమ్స్ పర్యటన కొనసాగుతుందని తెలిపారు ఆర్పీ సిసోడియా.

Read Also: Vinesh Phogat: పీటీ ఉష ఫొటో కోసమే వచ్చారు.. అదో పెద్ద రాజకీయం: వినేశ్‌ ఫొగాట్

వరద నష్టాన్ని కేంద్ర బృందానికి శాఖల వారీగా అధికారులు వివరణ ఇచ్చారు.. తమ తమ శాఖల్లో జరిగిన నష్టంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఆయా శాఖల అధికారులు.. ఏపీలో ఎన్నడూ రానంత వరద కృష్ణా నదికి వచ్చింది. వరదతో పాటు.. భారీగా వర్షాలు కురిశాయి. పది రోజుల పాటు పెద్ద ఎత్తున వరద సహయక చర్యలు చేపట్టాం. అన్ని శాఖల్లోని.. అన్ని స్థాయిల్లో ఉన్న అధికారులు వరద సహయక చర్యల్లోనే ఉన్నామని రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆర్పీ సిసోడియా వివరించారు.. సీఎం చంద్రబాబు పది రోజులు కలెక్టరేట్‌లోనే ఉండి వరద సహయక చర్యలపై పర్యవేక్షించారు. ఏపీకి వరదల వల్ల అపార నష్టం సంభవించింది. లక్షలాది ఇళ్లు నీట మునిగాయి. మొత్తం వరదల్లో దాదాపు ఏడు లక్షల మంది ఇబ్బందులు పడ్డారు. ప్రాథమికంగానే రూ. 6882 కోట్ల నష్టం వచ్చిందని మా అంచనాగా ఉంది.. కానీ.. పంటలు, రోడ్లు, విద్యుత్, ఇరిగేషన్ వ్యవస్థలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇంకా ఎన్యూమరేషన్ కొనసాగుతోందని తెలిపారు రెవెన్యూ శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఆర్పీ సిసోడియా.