AP Rain Alert: ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు.
వర్ష ప్రభావిత జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు హోం మంత్రి అనిత… అల్పపీడనం పరిస్థితిపై ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరిక సందేశాలు పంపాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు విపత్తుల నిర్వహణ సంస్థను 112, 1070, 1800 425 0101 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రానున్న మూడు రోజుల పాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనిత సూచించారు.
మరోవైపు తీరం వెంబడి గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అధికారులు జారీ చేసే సూచనలు పాటించాలని సూచించారు రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత..

