AP PPP Policy 2026: పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు.. స్వర్ణాంధ్ర విజన్–2047 లక్ష్యాలకు అనుగుణంగా భారీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పబ్లిక్–ప్రైవేట్ పార్టనర్షిప్ (PPP) ప్రాజెక్టులకు సంబంధించి కొత్త PPP పాలసీ–2026ను అమల్లోకి తీసుకొస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రైవేట్ పెట్టుబడులను పెంచడం ఈ కొత్త విధానం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు రూ.1.23 లక్షల కోట్ల విలువైన PPP ప్రాజెక్టుల పైప్లైన్ ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకెళ్లడంతో పాటు కొత్త పెట్టుబడులను ఆకర్షించేందుకు PPP పాలసీ–2026ను రూపొందించింది.
కీలక రంగాల్లో PPP ప్రాజెక్టులకు ప్రాధాన్యం
కొత్త పాలసీ కింద రవాణా, లాజిస్టిక్స్, పోర్టులు, విమానాశ్రయాలు, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వైద్యం, విద్య, పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధనం, పర్యాటక రంగాల్లో PPP ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రైవేట్ రంగానికి చెందిన పెట్టుబడులు, సాంకేతిక నైపుణ్యం, నిర్వహణ సామర్థ్యాలను ప్రభుత్వ ప్రాజెక్టుల్లో వినియోగించుకోవడమే పాలసీ ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది. దీని ద్వారా ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు, మెరుగైన ప్రజా సేవలు అందించడంతో పాటు పెట్టుబడిదారులకు అనుకూలమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
రూ.1,500 కోట్ల స్టేట్ VGF
PPP ప్రాజెక్టులకు ఆర్థికంగా ఊతమిచ్చేందుకు ప్రభుత్వం కీలక కేటాయింపు చేసింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.1,500 కోట్ల స్టేట్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF)ను కేటాయించింది. ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు అవసరమైన కీలక మూలధన అవసరాలను ఈ VGF ద్వారా భర్తీ చేయనున్నారు. ప్రారంభ దశలో ఆర్థికంగా పూర్తిస్థాయిలో లాభదాయకంగా లేని, అయితే భవిష్యత్తులో ఆదాయాన్ని సమకూర్చే అవకాశం ఉన్న ప్రాజెక్టులకు కూడా ఈ విధానం ద్వారా మద్దతు ఇవ్వనున్నారు.
వడ్డీలేని రుణ సదుపాయం
ప్రారంభ దశలో ఆర్థికంగా లాభదాయకత తక్కువగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో రెవెన్యూ షేరింగ్కు అవకాశం ఉన్న ప్రాజెక్టులకు ప్రాజెక్ట్ వయబిలిటీ బ్రిడ్జి ఫండ్ ద్వారా వడ్డీలేని రుణం అందించే విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో ప్రాజెక్టులు ప్రారంభ దశలో ఎదుర్కొనే ఆర్థిక అంతరాలను భర్తీ చేయడంతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు అవకాశం ఏర్పడుతుంది.
ప్రాజెక్టుల నుంచి అమలు వరకు సమగ్ర విధానం
PPP ప్రాజెక్టుల విషయంలో కేవలం పెట్టుబడులు ఆకర్షించడానికే పరిమితం కాకుండా, ప్రాజెక్టుల ప్రణాళిక నుంచి అమలు వరకు సమగ్ర విధానాన్ని ప్రభుత్వం రూపొందించింది. ప్లానింగ్, అప్రైజల్, ప్రొక్యూర్మెంట్, అమలు, పర్యవేక్షణ వంటి అన్ని దశలకు స్పష్టమైన విధానాన్ని PPP పాలసీ–2026లో పొందుపరిచింది. దీంతో PPP ప్రాజెక్టుల ఎంపిక, ఆర్థిక సాధ్యత పరిశీలన, టెండర్ల ప్రక్రియ, అమలు, పనితీరు పర్యవేక్షణ వంటి అంశాల్లో మరింత పారదర్శకత, సమన్వయం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇతర రాష్ట్రాల విధానాల పరిశీలన
PPP పాలసీ–2026 రూపకల్పనలో వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న PPP విధానాలను ప్రభుత్వం పరిశీలించింది. అలాగే సంబంధిత స్టేక్హోల్డర్ల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొంది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించే విధంగా పాలసీని రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ రంగ సామర్థ్యాలకు ప్రైవేట్ రంగ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణ నైపుణ్యాలను జోడించడం ద్వారా అభివృద్ధిని వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అన్ని శాఖలకు అమలు బాధ్యత
PPP పాలసీ–2026ను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, స్వయం ప్రతిపత్తి సంస్థలు అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్వర్ణాంధ్ర విజన్–2047 లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని భారీ స్థాయిలో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రైవేట్ పెట్టుబడుల సమీకరణ, నాణ్యమైన ప్రజా సేవల అందుబాటు, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పించడమే కొత్త PPP పాలసీ–2026 ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం స్పష్టం చేసింది.

