NTV Telugu Site icon

Nara Lokesh: కుంభమేళాలో మంత్రి లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు.. కుమారుడితో సెల్ఫీ వైరల్‌..!

lOkesh

lOkesh

Nara Lokesh: కుంభమేళా పోటెత్తుతోంది.. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్‌లో మహాకుంభమేళ ఘనంగా సాగుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాలకు చెందిన భక్తులు కూడా భారీగా కుంభమేళాకు తరలివస్తున్నారు. దీంతో.. ప్రతీ రోజూ కోట్లాది భక్తులు త్రివేణి సంగంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా సహా.. పలువురు ప్రముఖులు, సీఎంలు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఇలా చెబుతూ పోతే లిస్ట్ పెద్దదే.. అంతేకాదు.. ఎప్పుడూ లేని విధంగా రోజుకో రికార్డు తరహాలో కుంభమేళాకు తరలివస్తున్నారు భక్తులు.. ఇక, ఈ రోజు మహా కుంభమేళాలో ఏపీ మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు పుణ్యస్నానాలు ఆచరించారు.. ఈ సందర్భంగా తన భార్య, కుమారుడితో కలిసి దిగిన సెల్ఫీని మంత్రి లోకేష్‌ షేర్‌ చేయడంతో వైరల్‌గా మారిపోయింది..

Read Also: Manchu Manoj: నారా లోకేష్ ను కలిసిన మంచు మనోజ్

ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమం షాహి స్నానఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి.. గంగాదేవికి పూజలు చేసి, హారతులు ఇచ్చారు. పితృదేవతలను స్మరించుకుంటూ బ్రాహ్మణులకు వస్త్రదానం చేశారు. పూర్వీకులకు మోక్షమార్గాన్ని ప్రసాదించాలంటూ గంగాదేవిని ప్రార్థించారు. కుంభమేళా ప్రాంగణంలో ప్రతిధ్వనించే కీర్తనలు, నదీ సంగమం వద్ద పవిత్ర పూజల మధ్య ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో లోకేష్ దంపతులు మమేకమయ్యారు. మహా కుంభమేళా ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే కాదు.. ఇది భారతదేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వం. నమ్మకం, ఆచారాలు, ఆధ్యాత్మిక జ్ఞానంతో ముడిపడి ఉన్న శక్తిమంతమైన వేడుక. మానవత్వం, ఆధ్యాత్మికత మధ్య సంబంధాన్ని, లోతుగా నాటుకుపోయిన భారతజాతి విలువలను ప్రతిబింబిస్తుంది. పవిత్ర నదుల్లో ఆచరించే స్నానం, దానం, హృదయ పూర్వకమైన భక్తి మోక్ష మార్గాన్ని చూపిస్తాయని కోట్లాదిమంది నమ్మకం. ఇక, ఈ సందర్భంగా లోకేష్‌ దంపతులు తమ కుమారుడు దేవాన్ష్‌ తో కలిసి దిగిన సెల్ఫీ వైరల్‌గా మారిపోయింది.. మరోవైపు.. కుంభమేళాలో స్నానాలు, పూజాధికాల అనంతరం లోకేష్ దంపతులు కాశీ విశ్వేశ్వరుని ఆలయాన్ని సందర్శించేందుకు వారణాసి బయలుదేరి వెళ్లారు.