AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎప్పుడు అని అన్ని పార్టీలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి.. ఓవైపు ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తూనే.. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? అని వేచిచూస్తున్నారు.. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని ఎస్ఈసీ పరిశీలిస్తోంది. తొలి దశలో 59, రెండో దశలో 41 మున్సిపల్ సంస్థలకు ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మిగిలిన 23 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు సంబంధించిన కోర్టు కేసులు పరిష్కారమైన తర్వాత ప్రత్యేకంగా నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ముందుగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 59 స్థానిక సంస్థల్లో దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇప్పటికే డివిజన్లు, వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలను ఈ నెల 3న ప్రచురించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఇతర ప్రక్రియలను కూడా అధికారులు కొనసాగిస్తున్నారు. తొలి దశ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండో దశలో 41 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా జారీ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో 10,047 ఎంపీటీసీ, 660 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ఈ నెల 11తో పూర్తికానుంది.
అనంతరం 13,295 గ్రామ పంచాయతీలకు మూడో దశలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇలా దశలవారీగా పురపాలక, మండల, జిల్లా, గ్రామస్థాయి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. మొత్తం స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను డిసెంబరులోగా పూర్తి చేసి, వచ్చే జనవరి నాటికి అన్ని స్థానిక సంస్థల్లోనూ కొత్త పాలకవర్గాలు కొలువుదీరేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కోర్టు కేసుల పరిష్కారం, ఎన్నికల సంఘం షెడ్యూల్ ఆధారంగా తుది ఎన్నికల తేదీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

