AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్టోబర్ చివరి నాటికి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టుకు తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని ప్రభుత్వం కోరింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో సమావేశాలు నిర్వహిస్తోందని ఏజీ కోర్టుకు వివరించారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి, దాన్ని ఖరారు చేయాలని ఎస్ఈసీ ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. స్థానిక సంస్థలకు సంబంధించిన కొన్ని చట్టాల్లో సవరణలు చేస్తున్నామని, వాటిని ఆమోదం కోసం అసెంబ్లీ ముందు ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం కోర్టుకు నివేదించింది.
బీసీ రిజర్వేషన్లపై కమిషన్ నివేదిక
స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందని ఏజీ తెలిపారు. ఈ నివేదికను ప్రభుత్వం పరిశీలించి రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకున్న తర్వాత జీవో జారీ చేయనున్నట్లు కోర్టుకు వివరించారు. ప్రభుత్వం నిర్ణయం వెల్లడించిన అనంతరం కమిషన్ నివేదికను ప్రజల ముందుకు తీసుకువస్తామని ఏజీ తెలిపారు.
50 శాతం రిజర్వేషన్లు దాటకూడదని వాదన
విచారణ సందర్భంగా పార్టీ ఇన్ పర్సన్ న్యాయవాది తాండవ యోగేష్ వాదనలు వినిపిస్తూ.. రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంగా తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. ఒకవేళ 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఖరారు చేస్తే, ఆ నిర్ణయం కోర్టు పరిధిలోకి వెళ్లి ఎన్నికలు మరో రెండు మూడు నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. రిజర్వేషన్లు ఖరారు చేసే ముందు సంబంధిత అంశాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నామని పేర్కొంది. ఈ విషయంలో ఏజీ ప్రభుత్వానికి తగిన సలహా ఇస్తారని భావిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.
రెండు పిటిషన్లపై విచారణ
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రెండు ప్రజాహిత వ్యాజ్యాలు హైకోర్టు ముందుకు వచ్చాయి. బీసీ జనగణన చేపట్టి, దాని ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాతే స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు 2025లో పిల్ దాఖలు చేశారు. మరోవైపు రాష్ట్రంలోని 13,325 గ్రామపంచాయతీలు, 123 పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని న్యాయవాది తాండవ యోగేష్ మరో పిల్ దాఖలు చేశారు.
పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం
బీసీ సంఘం తరఫున సీనియర్ న్యాయవాది వాదిస్తూ.. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సమర్పించిన నివేదికను కోర్టు ముందు ఉంచేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. కమిషన్ ఏ అంశాల ఆధారంగా సర్వే నిర్వహించిందో తెలుసుకునే హక్కు తమకు ఉందని వాదించారు. దీనిపై ఏజీ స్పందిస్తూ.. కమిషన్ నివేదికను ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించిన తర్వాత నివేదికను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని చెప్పారు… ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు.. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. అక్టోబర్ చివరి నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం అమలులోకి వస్తుందా? రిజర్వేషన్లపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

