AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి సంచలన విషయాలు..!

Ap Liquor Scam Case

Ap Liquor Scam Case

AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ స్కామ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగం పెంచింది. మనీలాండరింగ్ కోణంలో కొనసాగుతున్న విచారణలో భాగంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలు, నగదు, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారికంగా వెల్లడించింది. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 11, 2026న పీఎంఎల్‌ఏ (PMLA) చట్టం కింద హైదరాబాద్‌లోని ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి, విజయ నరసింహ రెడ్డి, వల్లు సందీప్, కరుమూరి నాగేశ్వరరావు, కరుమూరి సునీల్ కుమార్‌ల నివాసాలు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు చేపట్టారు.. దీనిపై ఈడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది..

సోదాల సందర్భంగా ఒక లగ్జరీ కారుతో పాటు సుమారు రూ.94.5 లక్షల విలువైన ఖరీదైన గడియారాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ వెల్లడించింది. అదనంగా భారీ మొత్తంలో లెక్కల్లో చూపని నగదు కూడా పట్టుబడినట్లు పేర్కొంది. అనుమానాస్పద జాయింట్ వెంచర్ ఒప్పందాలు, నగదు లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, ఆస్తి పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. దర్యాప్తులో కీలక పురోగతిగా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. వారిని నాంపల్లి ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో హాజరుపర్చగా, కోర్టు జూన్ 25 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

×
×
Ad

ఈడీ దర్యాప్తు ప్రకారం, ఆంధ్రప్రదేశ్ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSBCL) లిక్కర్ రవాణా టెండర్ల నిబంధనలను కొందరికి అనుకూలంగా మార్చినట్లు గుర్తించింది. సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్, ప్రసాద్ ట్రాన్స్‌పోర్ట్స్ సంస్థలను ఫ్రంట్ కంపెనీలుగా ఉపయోగించినట్లు విచారణలో తేలినట్లు వెల్లడించింది. లిక్కర్ రవాణా వ్యవహారానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలన్నీ కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి వర్గం ఆధీనంలోనే ఉన్నట్లు ఈడీ పేర్కొంది. అధిక రేట్లకు టెండర్లు దక్కించుకుని అక్రమ లాభాలు ఆర్జించినట్లు విచారణలో బయటపడిందని తెలిపింది. ఈ కేసులో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ప్రధాన కుట్రదారుడిగా గుర్తించినట్లు వెల్లడించింది.

మాజీ ఐటీ సలహాదారుగా తన రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి టెండర్ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ ఆరోపించింది. జిల్లా స్థాయిలో కార్టన్‌కు సగటున రూ.19.68 ఉన్న రవాణా రేట్లను రూ.35.57 వరకు పెంచి భారీ లాభాలు పొందినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపింది. అలాగే స్థానిక రాజకీయ నాయకులు, అనుబంధ వ్యక్తులు, సంస్థలకు సబ్ కాంట్రాక్టులు కేటాయించే సమాంతర వ్యవస్థను నడిపినట్లు విచారణలో తేలినట్లు పేర్కొంది. అప్పటి APSBCL మేనేజింగ్ డైరెక్టర్ దొంతిరెడ్డి వాసుదేవ రెడ్డి ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా వ్యవహరించినట్లు ఆరోపించింది.

చట్టబద్ధమైన జిల్లా స్థాయి రవాణా విధానాన్ని రద్దు చేసి, ప్రభుత్వ అనుమతి లేకుండానే రాష్ట్రవ్యాప్త కేంద్రీకృత రవాణా విధానాన్ని అమలు చేసినట్లు ఈడీ వెల్లడించింది. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే నివేదికలు సమర్పించడం, అనుమతులు లేకుండానే కాంట్రాక్టులకు పదేపదే గడువు పొడిగింపులు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లినట్లు పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుమారు రూ.195.33 కోట్ల నష్టం జరిగినట్లు ఈడీ అంచనా వేసింది. కేసులో మనీలాండరింగ్ కోణంపై దర్యాప్తు మరింత వేగవంతంగా కొనసాగుతోందని, మరిన్ని కీలక వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఈడీ తెలిపింది.