AP High Court: వైసీపీ నేత శ్రీహరి కేసులో చట్టప్రకారం నడుచుకోవాలి.. పోలీసులకు హైకోర్టు కీలక ఆదేశాలు

Ap High Court

Ap High Court

AP High Court: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది. సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో నమోదైన కేసులపై విచారణ జరుపుతున్న సందర్భంగా, శ్రీహరి విషయంలో చట్టప్రకారం నడుచుకోవాలని గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులను హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు శుక్రవారం ఉత్తర్వులు వెలువరించారు. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) ప్రకారం శ్రీహరికి నోటీసులు జారీ చేసి, ఆయన నుంచి వివరణ తీసుకోవాలని పోలీసులకు సూచించారు. ఇప్పటికే శ్రీహరిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచిన నేపథ్యంలో, తదుపరి చర్యలు కూడా చట్టబద్ధంగా ఉండాలని కోర్టు పేర్కొంది.

ఇక, ఈ కేసుకు సంబంధించి విచారణను మే 5వ తేదీకి వాయిదా వేసింది. గుంటూరు, కొత్తపేట పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన కేసులపై కూడా కోర్టు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. తనపై నల్లపాడు, కొత్తపేట పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ శ్రీహరి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. కుప్పం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో కూడా సెక్షన్ 35(3) ప్రకారం నడుచుకోవాలని అక్కడి కోర్టు ఇప్పటికే ఆదేశించిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

అదేవిధంగా, కుప్పం కేసులో బయటకు వచ్చిన వెంటనే కొత్తపేట పోలీసులు శ్రీహరిని మళ్లీ అరెస్ట్ చేశారని న్యాయవాది తెలిపారు. శ్రీహరిపై నమోదు చేసిన సెక్షన్లు ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాలకు సంబంధించినవని కూడా కోర్టుకు వివరించారు. ఇక పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ, పిటిషనర్ దర్యాప్తుకు సహకరించడం లేదని కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం, శ్రీహరి విషయంలో చట్టపరమైన విధానాలను కచ్చితంగా అనుసరించాలని హైకోర్టు నల్లపాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి పరిణామాలు మే 5న జరగనున్న విచారణలో స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది.