AP High Court: డీఎస్సీ-2025 పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ను వాడొద్దు..!

Ap High Court Recruitment 2

Ap High Court Recruitment 2

AP High Court: ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నియామకాలు వివాదంగా మారాయి.. దీనిపై పాలక, ప్రతిపక్షం మధ్య ఆరోపణలు, సవాళ్ల పర్వం కొనసాగుతుండగా.. డీఎస్సీ-2025 నియామకాలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్)పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిల్‌లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. విచారణ సందర్భంగా స్పోర్ట్స్ కోటాలో నష్టపోయామని చెబుతున్న అభ్యర్థులు నేరుగా కోర్టును ఎందుకు ఆశ్రయించడం లేదని ధర్మాసనం ప్రశ్నించింది. బాధితులు భయపడుతున్నారనే వాదనతో తాము ఏకీభవించలేమని స్పష్టం చేసింది.

డీఎస్సీ నోటిఫికేషన్, నియామకాలను సవాల్ చేస్తూ ఇప్పటికే 335 పిటిషన్లు దాఖలయ్యాయని హైకోర్టు గుర్తుచేసింది. దీంతో న్యాయపరమైన పరిష్కారానికి కోర్టు తలుపులు అందరికీ తెరిచి ఉన్నాయని పరోక్షంగా సూచించింది ఏపీ హైకోర్టు.. ప్రజాహిత వ్యాజ్యం (పిల్) అనేది విలువైన న్యాయ సాధనమని పేర్కొన్న ధర్మాసనం, దానిని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించేందుకు అనుమతిస్తే.. పిల్ అసలు ఉద్దేశమే దెబ్బతింటుందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు పిల్‌లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. మొత్తంగా.. ఏపీలో డీఎస్సీ-2025 నియామకాలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. డీఎస్సీ-2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిల్‌లో జోక్యం చేసుకోవడానికి హైకోర్టు నిరాకరించింది. స్పోర్ట్స్ కోటాలో నష్టపోయామని చెబుతున్న అభ్యర్థులు స్వయంగా కోర్టును ఎందుకు ఆశ్రయించడం లేదని ప్రశ్నించిన ధర్మాసనం, వారు భయపడుతున్నారనే వాదనను అంగీకరించలేదు.