AP Government: చేపల వేట సమయంలో ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. గత ఆరేళ్లుగా (2018 నుండి) పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియా కేసులను పరిష్కరిస్తూ.. వాటికోసం నిధులను విడుదల చేసింది. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు ఈ మేరకు అధికారులతో సమీక్ష నిర్వహించి, పెండింగ్ ఫైళ్లను తక్షణమే క్లియర్ చేయాలని ఆదేశించారు.
95 కుటుంబాలకు రూ. 4.75 కోట్ల సాయం చేస్తోంది ఏపీ సర్కార్.. గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ (GAIS) కింద 2018 సంవత్సరం నుండి వివిధ సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయిన కేసులను ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుంది. ప్రమాదవశాత్తు మరణించిన 95 మంది మత్స్యకారుల కుటుంబాలను గుర్తించారు. ఇక, ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 4.75 కోట్లను ఎక్స్గ్రేషియాగా ప్రభుత్వం మంజూరు చేసింది. మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఇప్పటికే 90 మంది లబ్ధిదారుల కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నగదు నేరుగా జమ అయింది. మిగిలిన 5 మంది లబ్ధిదారుల ఖాతా వివరాల్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఈ సమస్యలను కూడా త్వరగా పరిష్కరించి, వారికి కూడా తక్షణమే నిధులు అందేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
