NTV Telugu Site icon

AP and Meta Key MoU: మెటాతో ఏపీ స‌ర్కార్‌ కీలక ఒప్పందం.. ఇక, స‌ర్టిఫికెట్ల క‌ష్టాల‌కు చెక్‌..

Ap And Meta

Ap And Meta

AP and Meta Key MoU: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. మెటాతో కీలక ఒప్పందం చేసుకుంది.. సర్టిఫికెట్ల కష్టాలకు టాటా చేబుతూ.. వాట్సాప్‌లోనే సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా ముందడుగు వేస్తోంది సర్కార్.. క్యాస్ట్ స‌ర్టిఫికెట్ కావాలంటే మూడు గ‌వ‌ర్నమెంట్ ఆఫీసులు, న‌లుగురు వ‌ర‌కూ వివిధ హోదాల అధికారులు, సిబ్బంది చిట్టూ ఓ వారం రోజులు తిర‌గాల్సిందే.. క‌రెంటు, న‌ల్లా, ఇంటి ప‌న్ను, ఇత‌ర‌త్రా బిల్లులు చెల్లించాలంటే సంబంధిత కార్యాల‌యాల్లో ఇప్పటికీ ఎడ‌తెగ‌ని క్యూలలో నిరీక్షణ తప్పడం లేదు.. అయితే, టీడీపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్రలో ఈ స‌ర్టిఫికెట్ల క‌ష్టాల‌ను యువ‌త ఏక‌రువు పెట్టారు. వాట్సప్ లో ఒక టెక్ట్స్ మెసేజ్ చేస్తే ఇంటికి, మ‌నిషికి అవ‌స‌ర‌మైన స‌మ‌స్త వ‌స్తువులు వ‌స్తున్నప్పుడు, సేవ‌లు అందుతున్నప్పుడు.. ఒక స‌ర్టిఫికెట్ కోసం ఆఫీసులు చుట్టూ ప‌నులు మానుకుని మ‌రీ తిర‌గాల్సిన ప‌రిస్థితికి చెక్ పెడ‌తామ‌ని, ప్రభుత్వంలోకి రాగానే.. వాట్సాప్‌ ద్వారా ప‌ర్మినెంట్ స‌ర్టిఫికెట్ పొందే అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు నారా లోకేష్‌.. ఇకె, అధికారంలోకి రాగానే కూట‌మి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెర‌వేరుస్తోంది.

ఏపీ విద్య, ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ శాఖ‌ల మంత్రిగా బాధ్యత‌లు నిర్వహిస్తోన్న నారా లోకేష్‌.. యువ‌గ‌ళం పాద‌యాత్రలో ఇచ్చిన హామీల‌న్నీ ప్రాధాన్యతా క్రమంలో అమ‌లు చేస్తున్నారు. ప్రతి ఏటా క్యాస్ట్ స‌ర్టిఫికెట్ల కోసం కార్యాల‌యాల చుట్టూ తిరిగే అవ‌స‌రం లేకుండా వాట్సప్ ద్వారా పొందే ప‌ద్ధతి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అలాగే వివిధ ర‌కాల బిల్లులు వాట్సప్ ద్వారా చెల్లించేయ‌వ‌చ్చు. ఫేస్‌బుక్‌, వాట్సాప్, ఇన్‌స్టా ఫ్లాట్ ఫామ్స్ ద్వారా ప్రపంచ‌మంతా విస్తరించిన మెటాతో కీల‌క ఒప్పందం కుదుర్చుకోనుంది ఏపీ ప్రభుత్వం. ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, ఆర్టీజీ, విద్య శాఖ‌ల మంత్రి నారా లోకేష్ చొర‌వ‌తో మెటా ప్రజ‌ల‌కు ప్రభుత్వం నుంచి పౌర‌సేవ‌లు వాట్సప్ బిజినెస్ ద్వారా అందించేందుకు అంగీక‌రించింది. మెటా ఫ్లాట్ ఫామ్‌ వాట్సాప్‌ బిజినెస్ ద్వారా ఇక‌పై క్యాస్ట్, ఇత‌ర‌త్రా స‌ర్టిఫికెట్లు వేగంగా, సుల‌భంగా పొందేందుకు వీలు అవుతుంది. అలాగే న‌కిలీలు, ట్యాంప‌రింగ్ అవ‌కాశం లేకుండా పార‌ద‌ర్శకంగా ఆన్‌లైన్‌లోనే స‌ర్టిఫికెట్ల జారీ ఉంటుంది. మెటా నుంచి క‌న్సల్టేష‌న్ టెక్నిక‌ల్ స‌పోర్ట్, ఈ గ‌వ‌ర్నెన్స్ అమ‌లు, ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ ద్వారా మ‌రిన్ని సిటిజెన్ స‌ర్వీసెస్ ఏపీ ప్రభుత్వానికి అందించేలా మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఏపీ అధికారులు, మెటా ప్రతినిధులు ఢిల్లీలోని 1 జన్‌పత్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ ఎంవోయూ చేసుకున్నారు.

ఇక, ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ మాట్లాడుతూ.. యువ‌గ‌ళం హామీలు నెర‌వేర్చడంలో మెటాతో ఎంవోయూ ఒక మైలురాయిగా అభివర్ణించారు.. మెటాతో ఎంవోయూ ఒక చారిత్రాత్మక‌మైన మైలురాయిగా అభివ‌ర్ణించారు. యువ‌గ‌ళం పాద‌యాత్రలో విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ స‌ర్టిఫికెట్ల కోసం ప‌డుతున్న క‌ష్టాలు ప్రత్యక్షంగా చూసి.. మొబైల్‌లోనే ఆయా స‌ర్టిఫికెట్లు అందిస్తాం అని హామీ ఇచ్చాను. మాట ఇచ్చిన‌ట్టే నేడు మెటాతో ఒప్పందం ద్వారా వాట్సాప్‌లోనే స‌ర్టిఫికెట్లు, పౌర‌సేవ‌లు పొందేలా మెటాతో ఒప్పందం చేసుకున్నాం. రానున్న రోజుల్లో మ‌రిన్ని సేవ‌లు ఆన్‌లైన్‌లో అతి సులువుగా, పార‌ద‌ర్శకంగా, అతి వేగంగా పొందే ఏర్పాట్లు చేస్తాం అని స్పష్టం చేశారు.. మరోవైపు.. మెటాలో ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ సేవ‌లను వాడుకుని వాట్సాప్‌ ద్వారా ఏపీ ప్రజ‌ల‌కు పౌర సేవలను అందించేందుకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని ప్రకటించారు మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంధ్యా దేవనాథన్ ప్రకటించారు..