Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..

Kinjarapu Atchannaidu

Kinjarapu Atchannaidu

Tobacco Farmers: వర్జీనియా (FCV) పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం రాజీ పడబోదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పొగాకు కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షించాలని, సరాసరి ధర కిలోకు రూ.200 కంటే తక్కువకు కొనుగోళ్లు జరిగే పరిస్థితి రానివ్వొద్దని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ జిలానీ, వర్జీనియా పొగాకు సాగు జరిగే జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి పొగాకు కొనుగోళ్లు, రైతుల సమస్యలు, ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఎరువుల లభ్యత, పంపిణీ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

పొగాకు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, కంపెనీలు నిర్ణయించిన నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. మార్కెట్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని కూడా ఆదేశించారు అచ్చెన్నాయుడు.. ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో రాష్ట్రంలో యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ సహా అన్ని రకాల ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. రైతులకు అవసరమైన సమయంలో ఎరువులు అందేలా నిల్వలు, రవాణా, పంపిణీపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, కృత్రిమ కొరత సృష్టించడం, నిల్వదాచివేత, అధిక ధరలకు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇటీవల జరిగిన పొగాకు బోర్డు 168వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావించిన మంత్రి, 2026–27 పంట సంవత్సరానికి మార్కెట్ పరిస్థితులు, దేశీయ, అంతర్జాతీయ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్‌లో FCV పొగాకు ఉత్పత్తి లక్ష్యాన్ని సుమారు 81 మిలియన్ కిలోలుగా నిర్ణయించినట్లు తెలిపారు. అదే సమయంలో FCV పొగాకు మార్కెటింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, కొనుగోళ్లలో పారదర్శకత పెంచడం, పంట నియంత్రణ వ్యవస్థలో అవసరమైన సంస్కరణలు తీసుకురావడం కోసం అన్ని భాగస్వాములతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని, పొగాకు రైతులకు గిట్టుబాటు ధరతో పాటు ఖరీఫ్ రైతులకు సకాలంలో ఎరువులు అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు..